వాన జాడేది...?
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:40 PM
నైరుతి రుతుపవనాలు జిల్లాకు రావడంలో ఆలస్యం కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా జూన్ రెండో వారం నుంచి తొలకరి వర్షాలు కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు వాన జాడ కానరావడం లేదు.
-రెండు వారాలుగా ముఖం చాటేసిన వర్షం
-నిండు వేసవిని తలపిస్తున్న ఎండలు
-చినుకు కోసం రైతుల ఎదురు చూపు
-జిల్లాలో గణనీయంగా పడిపోయిన వర్షపాతం
-ఆరుతడి పంటలే మేలంటున్న అధికారులు
మంచిర్యాల, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు జిల్లాకు రావడంలో ఆలస్యం కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా జూన్ రెండో వారం నుంచి తొలకరి వర్షాలు కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు వాన జాడ కానరావడం లేదు. ఈ సమయంలో విస్తారంగా వర్షాలు కురవాల్సిన చోట ఎండలు మండిపోతుండటంతో ప్రజ లు బెంబేలెత్తిపోతున్నారు. వాతావరణం వేసవిని తలపిస్తూ నిత్యం సగటు న 42 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా మే చివరి వారంలో కురిసే వర్షాలపై ఆధారపడి రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేస్తారు. ఈ ఏడాది కూడా మేలో అప్పుడప్పుడు కురిసిన వర్షా లతో దుక్కులు దున్నిన రైతులు వర్షాల కోసం వేచి చూస్తున్నారు. వానలు కురవకపోవడంతో వానాకాలం సాగు ఆలస్యం కానుంది. సకాలంలో వర్షా లు కురిస్తే భూమిలో వేడి వెళ్లిపోయి, పంట బాగా పండే అవకాశం ఉం టుంది. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసినా కొద్ది రోజులపాటు విత్తనాలు వేసేందుకు పరిస్థితులు అనుకూలించవు. భూమి లోపల వరకు పదన వెళితేనే సాగు చేయవచ్చునని రైతులు చెబుతున్నారు. జిల్లాలో గతంలో ఈ సమయానికి పత్తి సాగు సగం వరకు పూర్తయ్యేది. దీంతో ఈ సీజన్ లో వర్షాలు లేని కారణంగా ఇంకా విత్తనాలు విత్తనేలేదు.
మూడు లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు...
2026 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వానాకాలం సీజన్లో 3 లక్షల 33వేల 430 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. వానాకాలం సాగులో ప్రధానంగా జీలుగ, వరి, పత్తి, కంది, మొక్కజొన్న, పెసలు, మినుము పంటలు పండించే అవకాశాలు ఉన్నాయి. వరి లక్షా 57వేల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తుండగా, పత్తి లక్షా 76వేల 421 ఎకరాలు, మొక్కజొన్న 558 ఎకరాలు, జొన్న నాలుగు ఎకరాలు, పెసలు 188 ఎకరాలు, మినుములు 40 ఎకరాలు, కందులు 1549 ఎకరాల్లో సాగు కానున్నాయి. కేంధ్ర ప్రభు త్వం పత్తి మద్దతు ధరను రూ. 7,020కి పెంచడంతో ఈ సారి పత్తిసాగు వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో వర్షాలు మొహం చాటేయడంతో రైతుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆరుతడి పంటల వైపే మొగ్గు....
వర్షాకాలం సీజన్లో ఇప్పటికే 15 రోజులు గడిచిపోయాయి. వర్షాలు లేకపోవడంతో సాగు ఇప్పటికే ఆలస్యం కాగా, మిగిలిన సమయంలో ఆ రుతడి పంటలే మేలన్న భావనలో రైతులు ఉన్నారు. తీవ్ర వర్షాభావ ప రిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవ డంతో భవిష్యత్తులో కూడా చివరి ఆయకట్టు వరకు నీరందే పరిస్థితి ఉం డకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో సాధారణ సాగుకంటే భిన్నమైన పంటలు వేసుకుంటే నష్టం వాటిల్లకుండా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ఈ క్రమంలో వ్యవసాయాధికారులు కూడా రైతులు ఆరుతడి పంటలు వేస్తేనే మేలని సూచిస్తున్నారు. అలాగే పత్తి, వరి, ఇతర ప్రధాన పంటల సాగుకు మరికొద్ది రోజులు వేచి ఉండాలని సూచిస్తున్నారు. సా ధారణంగా 150 రోజుల్లో చేతికి వచ్చే రకం పంటలు కాకుండా 125 రోజు ల్లో పండే పంటలను ఎంచుకోవాలంటూ సూచిస్తున్నారు.
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు....
ఈ ఏడాది జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. సాధారణంగా జూన్ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సా ధారణ వర్షపాతం 34.3 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా, కేవలం 26.2 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ ర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో -24 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదుకావడం గమనార్హం.
జిల్లాలో వర్షపాతం ఇలా...
జిల్లాలో ఇప్పటి వరకు కురిసిన సగటు వర్షపాతం మండలాల వారీగా..
మండలం వర్షపాతం (శాతం)
జన్నారం -95
దండేపల్లి -100
లక్షెట్టిపేట -40
హాజీపూర్ -74
కాసిపేట 58
తాండూరు 2
భీమిని 2
కన్నెపల్లి 10
వేమనపల్లి -39
నెన్నెల -7
బెల్లంపల్లి 72
మందమర్రి 26
మంచిర్యాల -78
నస్పూర్ -76
జైపూర్ -69
భీమారం -13
చెన్నూరు -25
కోటపల్లి -39
సాగు వెనక్కి పట్టినట్లే....లగిశెట్టి రాజమౌళి, గుడిపేట
గత నెలలోనే దుక్కులు దున్ని వానాకాలం సాగు కోసం భూములు సిద్ధం చేశాం. భూమిలోని వేడి బయటకు పోతేనే విత్తనాలు వేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు గట్టి వర్షాలు పడకపోవడంతో వి త్తనాలు వేయలేని పరిస్థితులు ఉన్నాయి. చినుకు కోసం రైతులంతా ఎ దురు చూస్తున్నాం. రెండు మూడు వర్షాలు గట్టిగా కురిస్తేనే వ్యవసాయ పనులు ముందుకు సాగుతాయి. ఇంక కొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటే ఆరుతడి పంటలే వేసుకోవలసి వస్తుంది.