kumaram bheem asifabad- అర్హులకు సంక్షేమ పథకాలు
ABN , Publish Date - May 02 , 2026 | 10:34 PM
జిల్లాలోని అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారంనిర్వహించిన ఆసిఫాబాద్ నియోజకవర్గస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారంనిర్వహించిన ఆసిఫాబాద్ నియోజకవర్గస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందిస్తుందని చెప్పారు. చేయూత పెన్షన్లు, కొత్త రేషన్కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రైతుభరోసా, రైతుబీమా, ఇందిరమ్మ ఇళ్లు 200 యూనిట్ల విద్యుత్, రూ. 500 గ్యాస్ సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు. ఈనెల 4 నుంచి 9 వరకు రైతు వారోత్సవాల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, గ్రంధాలయసంస్థ చైర్మన్ అనిల్ కుమార్, ఏఎంసీ మార్కెట్ కమీటి ఛైర్మన్ ఇరుకుల్ల మంగ, మున్సిపల్ చైర్మన్ అకాష్, వైస్ చైర్మన్ ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశం రసాభాస..
కాగా కలెక్టరేట్లో శనివారం జరిగిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశం రసాభసాగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ రూ. 500 అమలు కావడంలేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడంలేదని, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాగితాల మీద లెక్కలు చూపుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పనులు ఎక్కడ పూర్తి కావడంలేదన్నారు. ప్రొటోకాల్ విషయంలో కూడ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి అదుపుతప్పడంతో సమావేశాన్ని అదికారులు అర్థంతరంగా ముగించారు.