ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:44 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం పట్టణంలోని 17,31,32,33 వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల కార్యచరణ రూపొందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలకు కేటాయించిన పనులను సమగ్ర ప్రణాళికలతో అమలు చేయాలన్నారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, వైద్యఆరోగ్య సేవలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహనకార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. మున్సిపాలిటీల్లో వీధి కుక్కలను నివారించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. వేసవి దృష్య్టా ప్రజలకు తాగునీటి ఇబ్బంది కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, మున్సిపల్ కమీషనర్ సంపత్రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.