పాలిస్టర్ వస్త్రానికి కూలి పెంచాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 01:05 AM
పాలిస్టర్ వస్త్రానికి యజమానులు కూలీ పెంచాలంటూ ఈ నెల 27నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ ప్రకటించారు. సిరిసిల్ల పట్టణంలో సోమవారం సీఐటీయూ పవర్లూం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 20 (ఆంఽధ్రజ్యోతి) : పాలిస్టర్ వస్త్రానికి యజమానులు కూలీ పెంచాలంటూ ఈ నెల 27నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ ప్రకటించారు. సిరిసిల్ల పట్టణంలో సోమవారం సీఐటీయూ పవర్లూం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలిస్టర్ వస్త్రానికి కూలీ పెంచాలంటూ ఒక్కరోజు పాలిస్టర్ వస్త్రా పరిశ్రమలను బంద్ చేసి పట్టణంలోని పాలిస్టర్ అసోసియేషన్ భవనం ఎదుట దీక్షలను చేపట్టారు. ఈ దీక్షలల్లో పవర్లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, అసాముల సంఘం అధ్యక్షులు సిరిసిల్ల రవీందర్, వార్పిన్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్లె సత్యం, వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కుమ్మరి కుంట కిషన్, ఉడుత రవి, ఎలిగేటి శ్రీనివాస్, అడెపుమోహన్, బాస శ్రీధర్, రాజు, బెజుగం సురేష్, సబ్బని చంద్రకాంత్ కూర్చోగా రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ వారికి దండలు వేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో రమేష్ మాట్లాడుతూ యాజమానులు పాలిస్టర్ వస్త్రానికి కూలీ పెంపు పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నందున ఈ నెల 27 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని దీక్ష సందర్భంగా అందరి సమక్షంలో నిర్ణయం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా యాజమానులు వెంటనే స్పందించి సమ్మెకు వెళ్లముందే కార్మికులు , ఆసాముల కూలీ పెంచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ వృత్తిలో బతకలేమని చాలామంది కార్మికులు ఇతర వృత్తులకు వెళ్లడం జరుగుతుందన్నారు. యాజమానులు లాభాలను గురించి అలోచిస్తున్నారనే తప్ప కార్మికుల గురించి అలోచించకుపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఏప్రిల్ 27 నుంచి జరిగే నిరవధిక సమ్మెలో మరమగ్గాల కార్మికులు , అసాములు అందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అన్నల్దాస్ గణేష్, ఎలిగేటి రాజేశేఖర్ తదితరులు పాల్గొన్నారు.