బీసీ కులగణన కోసం 9నుంచి వీహెచ్ ఆమరణ దీక్ష
ABN , Publish Date - May 06 , 2026 | 07:25 AM
జనగణనలో బీసీ కులాల గణనా చేపట్టాలన్న డిమాండ్తో ఈనెల 9 నుంచి హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు ప్రకటించారు.
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): జనగణనలో బీసీ కులాల గణనా చేపట్టాలన్న డిమాండ్తో ఈనెల 9 నుంచి హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు ప్రకటించారు. బీసీల కోసం తన ప్రాణాలకు తెగించి మరీ ఉద్యమిస్తానన్నారు. తన దీక్షకు సహకరించాలని బీసీ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. గాంధీభవన్లో మంగళవారం మీడియాతో వి.హన్మంతరావు మాట్లాడుతూ, జనగణనలో బీసీ కులగణన చేపట్టాలన్న ఆలోచన బీసీ ప్రధాని అయిన మోదీకి ఉన్నదా.. లేదా అని ప్రశ్నించారు. ఈనెల 8లోపు దీనిపై స్పష్టత ఇచ్చిన తర్వాతే మోదీ హైదరాబాద్కు రావాలన్నారు. లేని పక్షంలో 9న ఉదయం 10 గటలకు ఆమరణ దీక్ష చేపడతానని వి.హన్మంతరావు స్పష్టం చేశారు. బీసీ కులగణన ఇప్పుడు చేపట్టకుంటే ఎప్పటికీ జరగబోదన్నారు. అగ్రకులానికి చెందినవాడైన సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో కులగణన సర్వే చేపడితే.. బీసీ వాడైన ప్రధాని ఎందుకు చేపట్టట్లేదని నిలదీశారు.