దేవుడిచ్చిన సోదరుడు రేవంత్రెడ్డి
ABN , Publish Date - May 25 , 2026 | 05:21 AM
దేవుడిచ్చిన సోదరుడు రేవంత్రెడ్డి.. ఆయన నాకెంతో గౌరవాన్ని ఇచ్చాడు’ అంటూ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.
8 ఏళ్లు మేం ఎన్నో కష్టాలు పడ్డాం..
రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి
హనుమకొండ సిటీ, మే 24 (ఆంధ్రజ్యోతి): ‘దేవుడిచ్చిన సోదరుడు రేవంత్రెడ్డి.. ఆయన నాకెంతో గౌరవాన్ని ఇచ్చాడు’ అంటూ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ఆదివారం హనుమకొండలోని డీ కన్వెన్షన్ హాల్లో నరేందర్ రెడ్డి సన్మాన కార్యక్రమం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సభాధ్యక్షత వహించారు. నరేందర్రెడ్డిని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. ‘మారుమూల పల్లెటూరు నుంచి నేను ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. 8 ఏళ్ల పాటు రేవంత్, నేనూ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. బీఆర్ఎస్ పాలనలో ఇబ్బందులు పడ్డాం. అయినా రేవంత్ ఎక్కడా తగ్గకుండా పోరాటంతో ముందుకు కదిలారు. మమ్మల్ని కాంగ్రెస్ కలిపేసుకుంది. సీఎం రేవంత్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తా..’ అని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ నేతలు నియంతలా రాష్ట్రాన్ని పాలించారని.. రాజకీయాలను బందీ చేశారని మండిపడ్డారు. మతతత్వ బీజేపీ పాలన విముక్తి కోసం రాహుల్ను ప్రధానిగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.