kumaram bheem asifabad- కూరగాయల ధరలు పైపైకి..
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:32 PM
మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. అకాల వర్షాలు, భారీ వర్షాలు, వేసవి కాలం, పండుగల సీజన్లో ఎప్పుడైనా అదను దొరికిందంటే చాలు ధరలు అమాంతం పెంచేస్తుంటారు. వ్యాపారులు సిండికేట్గా మారడంతో కొన్ని రకాల కూరగాయలు వారం క్రితంతో పోల్చితే ధరలు రెండింతలయ్యాయి.
- చిక్కుడు కాయలు కిలోకి రూ. 100
కాగజ్నగర్ టౌన్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. అకాల వర్షాలు, భారీ వర్షాలు, వేసవి కాలం, పండుగల సీజన్లో ఎప్పుడైనా అదను దొరికిందంటే చాలు ధరలు అమాంతం పెంచేస్తుంటారు. వ్యాపారులు సిండికేట్గా మారడంతో కొన్ని రకాల కూరగాయలు వారం క్రితంతో పోల్చితే ధరలు రెండింతలయ్యాయి. కాగజ్నగర్లో మాత్రం రూ. 100 పెట్టనిదే కూరగాయలు రాని పరిస్థితి. ధరలు అమాంతం పెరుగుతున్నప్పటికి సంబంధిత అధికారులు మాత్రం ధరలు అదుపు చేయడం లేదు. ఒక్క సారి పెరిగిన ధరలు సప్లయ్ ఎక్కువైతే తిరిగి ధరలు యఽథాస్థితికి రావాలి కాని ఇక్కడ అలా జరగడం లేదు. అడిగే వారు లేరనే ధీమాతో ధరలు ఆకాశనంటిస్తున్నారు. ప్రతీ సారి ధరలు ఆకాశాన్నంటిన తర్వాత దిగి రాకపోవడం తోడు ప్రస్తుత సీజన్లోనూ పెంచిన రేట్లు అమలులో ఉన్నాయి. ఒక్కసారి పెరిగిన రేట్లను తిరిగి యధావిధిగానే వినియోగదారులను దోచుకుటున్నా పట్టించుకోవడం లేదు. కూరగాయల డిమాండ్ ఓ వైపు పెరుగుతండడంతో పాటు మరో వైపు దిగుమతులు సరిగా లేక ధరలు అమాంతం పెంచేస్తున్నారు. మామూలుగా అయితే కోల్ బెల్ట్ ప్రాంతం కన్నా అధికంగా ధరలు కాగజ్నగర్లో ఉంటున్నాయని ప్రజలు అంటున్నారు.
- రైతు బజార్ ఏర్పాటులో అలసత్వం..
కాగజ్నగర్ ప్రాంతంలో ఇప్పటి వరకు రైతు బజార్ ఏర్పాటు కాలేదు. జిల్లా కేంద్రంతో పాటు పలు చోట్ల రాష్ట్రంలో రైతు బజార్ కేంద్రాలు ఉన్నాయి. దీంతో పక్కనే ఉన్న కోల్ బెల్ట్ ఏరియాలో కూడా కూరగాయల ధరలు తక్కువగానే ఉన్నాయని వినియోగదారులు పేర్కొంటున్నారు. బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి, గోదావరిఖని, రెబ్బెన, తాండూరు తదితర ప్రాంతాల్లో కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయంటున్నారు. అయితే కోల్బెల్ట్ ఏరియాతో పోలిస్తే స్థానికంగా తక్కువగా ఉండాల్సి ఉన్న హోల్సేల్ వ్యాపారుల దెబ్బకు ధరలు ఆకాశానంటున్నాయని ఆరోపణలున్నాయి. దళారులు రేట్లను పెంచేస్తుండడంతో ధరలు చుక్కలనంటున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రైతు బజార్ ఉంటే చుట్టు పక్కల ప్రాంతాల్లోని గ్రామీణులు రైతు బజార్లో అమ్మకాలు చేపడతారు. దీంతో ధరలు స్థిరంగా ఉంటాయని సిండికేటు వ్యాపారులకు అండగా వ్యూహాత్మకంగా రైతు బజార్ ఏర్పాటు చేయకపోడంతో దశాబ్దాలుగా ధరలు ఎక్కువగా ఉండి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- దిగుమతి లేకపోవంతో
ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు, ఉల్లి, ఆలు గడ్డలు ఇతర కూరగాయలు దిగుమతి లేకపోవడంతోనే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఏటా వేసవిలో కూరగాయలు ధరలు పెరిగినా, తిరిగి అదే విధంగా కొనసాగించడం చూస్తే వ్యాపారుల కుమ్మక్కు పరిస్థితికి అద్దం పడుతోంది. స్థానికంగా పండించే కూరగాయలను సిండికేటు వ్యాపారుల భయంతో గ్రామీణ రైతులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయల ధరలు ట్రాన్స్పోర్టు ఛార్జీలతో అధికంగా ఉంటున్నాయి. ఏదేమైనా ప్రతీ రోజు ప్రతీ ఇంటా అవసరమయ్యే కూరగాయల ధరలు సామాన్యునికి అందుబాటులోకి తెచ్చేవిధంగా కూరగాయల ధరలు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
=====================================================
కూరగాయలు ప్రస్తుతం ధర కిలో రూ. గత వారం ఇలా..
=====================================================
టమాటా 30 25
వంకాయ 40 20
బెండకాయ 60 30
చిక్కుడు 100 40
పచ్చి మిర్చి 80 40
అలిచెంత 60 30
బీరకాయ 120 50
క్యాబేజి 100 120
ఫూల్ గోబీ 100 50
ఉల్లి గడ్డ 25 20
ఆలు గడ్డ 60 50
=====================================================