Share News

రైతులు ఆరు తడి పంటలు వేయాలి: ఉత్తమ్‌

ABN , Publish Date - Jul 10 , 2026 | 06:29 AM

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండటంతో వరదలు వచ్చే అవకాశముందని, శ్రీపాద ఎల్లంపల్లికి ప్రవాహాలు ప్రారంభం కాగానే ఎత్తిపోతల పథకాల..

రైతులు ఆరు తడి పంటలు వేయాలి: ఉత్తమ్‌

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండటంతో వరదలు వచ్చే అవకాశముందని, శ్రీపాద ఎల్లంపల్లికి ప్రవాహాలు ప్రారంభం కాగానే ఎత్తిపోతల పథకాల పంపింగ్‌ను ప్రారంభించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు, ఆరు తడి పంటలపై రైతాంగం దృష్టి సారించాలని సూచించారు. భారత వాతావరణ కేంద్రం సూచనలన్నీ పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలన్నారు. ఈ విషయంలో రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని గుర్తు చేశారు. వదంతులను నమ్మకుండా అధికార యంత్రాంగం, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చే మార్గదర్శకాలనే పాటించాలని కోరారు. గురువారం సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. వర్చువల్‌గా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ప్రతి జిల్లాలో వర్షపాతం, భూగర్భ జలాలు, రిజర్వాయర్‌ నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ వాటికి అనుగుణంగా పంటల ప్రణాళికను రూపొందించాలని ఉతమ్‌ ఆదేశించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే సంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరు తడి పంటలు సాగు చేసేలా రైతాంగాన్ని ప్రోత్సహించాలన్నారు. దీనికోసం గ్రామ సభలు, రైతు వేదికలు, క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపట్టి రైతులకు విస్తృతంగా వివరించాలని సూచించారు.

Updated Date - Jul 10 , 2026 | 06:30 AM