తమిళనాట కాంగ్రెస్ గెలుపునకు బహుముఖ వ్యూహం: ఉత్తమ్కుమార్ రెడ్డి
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:27 AM
తమిళనాడులో ఈ నెల 23న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు బహుమఖ వ్యూహం రూపొందిస్తున్నట్టు మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.
చెన్నై, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో ఈ నెల 23న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు బహుమఖ వ్యూహం రూపొందిస్తున్నట్టు మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆయన వెల్లడించారు. తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సీనియర్ పరిశీలికుడిగా ఉత్తమ్ను కుమార్రెడ్డిని ఏఐసీసీ నియమించిన విషయం విదితమే. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను స్టార్ క్యాంపెయిునర్లుగా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. అందులో భాగంగానే ఉత్తమ్ చెన్నైలో పార్టీ పరిశీలకులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచార వ్యూహం, సమన్వయంతోపాటు పార్టీ సంస్థాగత పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై తనతోపాటు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ముకుల్ వాస్నిక్, ఖాజా మొహినుద్దీన్తో కలిసి సమీక్షించినట్టు తెలిపారు.