kumaram bheem asifabad- సమస్యలపై ఏకరువు
ABN , Publish Date - Aug 04 , 2026 | 10:38 PM
మండలంలోని ఆయా గ్రామపంచాయతీలలో నెలకొన్న సమస్యలపై సర్పంచులు ఏకరువు పెట్టారు. స్థానిక సంస్థల్లో భాగమైన జడ్పీటీసీ, ఎంపీపీ వ్యవస్థలు మనుగడలో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలో సర్పంచ్లను భాగస్వాములను చేస్తూ ప్రతీ 40 రోజులకు ఒకసారి మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ మండల సమావేశాన్ని మొట్టమొదటి సారిగా నిర్వహించారు.
ఆసిఫాబాద్రూరల్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆయా గ్రామపంచాయతీలలో నెలకొన్న సమస్యలపై సర్పంచులు ఏకరువు పెట్టారు. స్థానిక సంస్థల్లో భాగమైన జడ్పీటీసీ, ఎంపీపీ వ్యవస్థలు మనుగడలో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలో సర్పంచ్లను భాగస్వాములను చేస్తూ ప్రతీ 40 రోజులకు ఒకసారి మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ మండల సమావేశాన్ని మొట్టమొదటి సారిగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా జిల్లా పరిషత్ సీఈవో, మండల ప్రత్యేకాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ ఆలీబీన్ ఆహ్మద్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మంగ, తహసీల్దార్ రీయాజ్ఆలీ ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. శాఖలవాఈగా ప్రగతి నివేదికలు అధికారులు వివరించారు. రాజంపేట సర్పంచ్ బుర్స పోచయ్య మాట్లాడుతూ రాజంపేట గ్రామపంచాయతీ నూతనంగా ఏర్పడిందని చెప్పారు. కార్మికులు లేక పారిశుధ్య పనులు నిర్వహించలేక పోతున్నామని వివరించారు. 16 మంది సిబ్బంది కావాలని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదన్నారు. గుండి సర్పంచ్ జాబరి రవీందర్ మాట్లాడుతూ గుండి గ్రామంలోని సబ్సెంటర్లో ఎంఎల్హెచ్పీని తిరిగి నియమించాలని కోరారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తున్న యూరియా యాప్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాబాపూర్ రాజన్న మాట్లాడుతూ విద్యుత్ సమస్యను కనీసం పట్టించుకునేవారు లేరని వాపోయారు. సమస్య పరిష్కరించకుంటే విద్యుత్శాఖ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. సాలేగూడ సర్పంచ్ వందన మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని చెప్పారు. విద్యుత్ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంకుశాపూర్ సర్పంచ్ టేకం గంగారాం మాట్లాడుతూ మెడికల్ కళాశాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే రోడ్డు నిర్మించాలని కోరారు. రహపల్లి సర్పంచ్ సుంకరి మంగ మాట్లాడుతూ వట్టివాగు కెనాల్ను కొంతమంది అక్రమంగా పూడ్చివేయడంతో మురుగునీరుతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కెనాల్లో పూడిక తొలగించాలని కోరారు. జిల్లా పరిషత్ సీఈవో, మండల ప్రత్యేకాధికారి లక్ష్మీనారాయణ, మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఏవో మిలింద్, ఏఈ ఊర్మిళ, డిప్యూటీ రేంజర్ యోగేష్, ఏఈ జ్యోతి, ఏఈ శైలేందర్, వైద్యాధికారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.