kumaram bheem asifabad-సన్నాలపై సందిగ్ధం
ABN , Publish Date - Jun 21 , 2026 | 10:03 PM
వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వరి సాగుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులను అయోమయంలోకి నెట్టింది. దొడ్డు రకాలను తగ్గించి, సన్నరకాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించగా, ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు.
- బోనస్పై రైతుల మల్లగుల్లాలు
బెజ్జూరు, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వరి సాగుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులను అయోమయంలోకి నెట్టింది. దొడ్డు రకాలను తగ్గించి, సన్నరకాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించగా, ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. సన్నరకాల సాగును పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్లెక్సీలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది. అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎనిమిది సన్న రకాలను మాత్రమే సాగుకు సిఫార్సు చేసింది. దీంతో విశ్వవిద్యాలయం రూపొందించిన ఇతర రకాలు, ప్రైవేటు కంపెనీల రకాలను సాగు చేస్తే బోనస్(క్వింటాల్కు రూ.500) వర్తిస్తుందా? లేదా? అన్న అంశంపై రైతుల్లో తీవ్రమైన సందిగ్దత నెలకొంది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో తామే ఏ రకాలను ఎంచుకోవాలో అర్థం కాక రైతులు అయోమయానికి గురవుతున్నారు.
- గతంలో 33రకాలకు బోనస్..
ప్రభుత్వం గతేడాది వానాకాలం సీజన్లో 33రకాల సన్నాలపై బోనస్ ప్రకటించింది. ఏ రకంలోనైనా గింజ పొడవు 6ఎంఎం, వెడల్పు 2ఎంఎం కంటే తక్కువ ఉండాలి. పొడవు వెడల్పు నిష్పత్తి 2.5ఎంఎం కంటే ఎక్కువగా ఉంటే ఆ రకాలకు ప్రాధాన్యమిచ్చి సన్నరకం కింద క్వింటాల్కు రూ.500చొప్పున చెల్లించింది. జిల్లాలో 4.50లక్షల ఎకరాల్లో వివిద పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో సుమారు 56వేల ఎకరాల్లో వరి సాగు అవుతుంది. వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్న రకాల్లో బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048(తెలంగాణ సోనా), కేఎన్ఎం-1638(కూనారం వరి-2), జేజీఎల్-1798(జగిత్యాల సన్నాలు), జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, వరంగల్- 44(సిద్ధి), డబ్ల్యూజీఎల్-962మాత్రమే ఉన్నాయి. వీటికి బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉంది. అయితే ఈ ఎనిమిది రకాల పంటకాలం ఎక్కువగా ఉండడం, చీడపీడలు, పురుగు, దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఈ రకాలు అధిక దిగుబడి ఇస్తాయని, రైతులకు అధిక ఆదాయం వస్తుందని ప్రచారం చేస్తోంది.