దివ్యాంగుల గౌరవానికి ప్రతీక యూడీఐడీ
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:51 AM
యూనిక్ డిజేబుల్ ఐడీ అనేది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదని, అది దివ్యాంగుల గౌరవానికి ప్రతీకగా నిలిచే హక్కు పత్రమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
నిలోఫర్లో యూడీఐడీ ఎవాల్యూయేషన్ కేంద్రం..ప్రారంభించిన మంత్రి సీతక్క
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : యూనిక్ డిజేబుల్ ఐడీ అనేది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదని, అది దివ్యాంగుల గౌరవానికి ప్రతీకగా నిలిచే హక్కు పత్రమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిలోఫర్ ఆసుపత్రిలో యూనిక్ డిజేబుల్ ఐడీ ఎవాల్యూయేషన్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి యూడీఐడీ కార్డు ఒక కొత్త జీవితం వైపు దారి చూపుతుందని, దివ్యాంగుల సామాజిక గుర్తింపును బలపరుస్తుందని తెలిపారు. దివ్యాంగుల వైకల్యాన్ని కచ్చితంగా గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 20 కోట్లు వెచ్చించి ఆధునిక వైద్య పరికరాలను కొనుగోలు చేసి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం 33 జిల్లాలకు 792 ఆధునిక వైద్య పరికరాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. నిలోఫర్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఆటిజమ్ గుర్తింపు పరీక్షలను నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు సుమారు 730 ఆటిజమ్ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు.