ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీఐడీకి అప్పగించాలి
ABN , Publish Date - Aug 10 , 2026 | 04:00 AM
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీఐడీకి బదిలీ చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ను సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు కోరారు.
డీజీపీ సీవీ ఆనంద్కు సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు లేఖ
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీఐడీకి బదిలీ చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ను సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు కోరారు. కేసు దర్యాప్తు తీరుపై పలు సందేహలు ఉన్నాయంటూ డీజీపీకి ఆదివారం ఆయన లేఖ రాశారు. ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు అవసరాన్ని పరిశీలించాలని, అరెస్టుకు ముందు చట్టపరమైన ప్రమాణాలు పాటించారా లేదా అనే విషయం తేల్చాలని కోరారు. ప్రారంభ ఫిర్యాదులో లేని అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు తర్వాత ఏలా చేరాయని లేఖలో ఆయన ప్రశ్నించారు. కస్టడీలో వేధింపులు, సీసీటీవీ లేని ప్రాంతాల్లో విచారణ జరిగిందన్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లో చంపుతామని బెదిరించారన్న ఆరోపణలపైనా దర్యాప్తు చేయాలని, హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ కేసు దర్యాప్తులో వ్యక్తిగతంగా పాల్గొన్నారన్న ఆరోపణలపై శాఖాపరమైన విచారణ జరపాలని కోరారు.