జవహర్నగర్ దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - May 16 , 2026 | 05:04 AM
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పరిధిలోని కౌకూర్లో జరిగిన నేపాలి ముఠా దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వృద్ధ దంపతులకు ....
బిట్స్ పిలానీ, మే 15 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పరిధిలోని కౌకూర్లో జరిగిన నేపాలి ముఠా దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి భారీ దోపిడీకి పాల్పడిన ఈ ఘటనలో నిందితుల కోసం మల్కాజిగిరి పోలీసులు ఉత్తరప్రదేశ్, నేపాల్ సరిహద్దులో విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మమత అలియాస్ మీనా కడాయత్, ఆమె భర్త రమేశ్ను పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలింపును ముమ్మరం చేశారు. దోపిడీ అనంతరం నిందితులు ఇంటి యజమాని ద్విచక్ర వాహనాన్ని తీసుకుని పరారయ్యారు. ఆ వాహనాన్ని యాప్రాల్ ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులకు ఆశ్రయం కల్పించాడనే ఆరోపణలతో భీమ్ అనే ఏజెంట్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.