ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు
ABN , Publish Date - May 25 , 2026 | 04:45 AM
ఆర్టీసీ ప్రయాణికుల రక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు రక్షణ కల్పిస్తూ.. ప్రశాంతమైన వాతావరణంలో తమ గమ్యస్థానాలకు చేరుకునేలా....
ప్రయాణికుల భద్రతకు హైటెక్ రక్షణ కవచం
‘బస్సులో భరోసా’ పేరిట నిరంతరం పర్యవేక్షణ
ఆదిలాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ప్రయాణికుల రక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు రక్షణ కల్పిస్తూ.. ప్రశాంతమైన వాతావరణంలో తమ గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సుల్లో అత్యాధునిక సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ‘బస్సులో భరోసా’ పేరిట సరికొత్త హైటెక్ భద్రతా ప్రాజెక్టును అమల్లోకి తెచ్చింది. తొలి దశలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించారు. ఈ సరికొత్త భద్రతా వ్యవస్థ కింద ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో ఈ అత్యాధునిక నిఘా నేత్రాలను అమర్చారు. ఈ విజువల్స్ అటు డ్రైవర్, కండక్టర్లకు అందుబాటులో ఉండటమే కాకుండా ఆర్టీసీ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించేలా కనెక్ట్ చేశారు. దీనివల్ల బస్సుల్లో దొంగతనాలు చేసే ముఠాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ముందే గుర్తించి అప్రమత్తం కావడానికి అవకాశం ఉంటుంది. మహిళా ప్రయాణికులపై వేధింపులు, దొంగతనాలు, అనుచిత ప్రవర్తన వంటి ఘటనలకు చెక్ పెట్టేలా ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సుదూర ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్థ ప్రయాణికులకు ఆర్టీసీ చర్య భరోసా కల్పించనుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు సాధించే ఫలితాలను బట్టి రాష్ట్రంలోని అన్ని డిపోల బస్సుల్లో సీసీ కెమెరాలకు అమర్చేందుకు సంస్థ యాజమాన్యం ప్రణాళికలు సిద్థం చేస్తోంది. కాగా, ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. ప్రయాణికులకు భద్రతతోపాటు సిబ్బంది పనితీరు మెరుగుపడుతుందని, ప్రయాణికుల పట్ల సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.