ఆర్టీసీ ఎండీతో జేఏసీ నేతల భేటీ
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:45 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కార్మికుల సమస్యల పరిష్కారం, సమ్మె డిమాండ్ల సాధనలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు సత్వరమే అమలు జరిగేలా చర్యలు...
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కార్మికుల సమస్యల పరిష్కారం, సమ్మె డిమాండ్ల సాధనలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు సత్వరమే అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డిని కోరారు. బస్భవన్లో సోమవారం ఆయనతో సమావేశమై ప్రధానంగా యూనియన్ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ యాజమాన్యం, రిటర్నింగ్ అధికారులు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలన్నారు. యూనియన్ ఎన్నికల నిర్వహణకు తగు చర్యలు తీసుకుంటామని, యాజమాన్యం పరిష్కరించదగ్గ అంశాలను దశలవారిగా పరిష్కరిస్తామని ఎండీ వై. నాగిరెడ్డి జేఏసీ నేతలకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సమ్మె డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చల సందర్భంగా సానుకూలంగా స్పందించినందుకు ఎండీని జేఏసీ నేతలతో పాటు ఇతర కార్మిక సంఘాల నాయకులు సన్మానించారు.