ఓవర్లోడ్తో వెళ్తున్న 100 వాహనాల సీజ్
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:09 AM
పరిమితికి మించిన బరువుతో సరుకు రవాణా చేస్తున్న వాహనాలపై రవాణా శాఖ కొరడా ఝళిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి మొబైల్ స్క్వాడ్ బృందాల తనిఖీలు చేపట్టి..
రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ స్క్వాడ్ బృందాల తనిఖీలు
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : పరిమితికి మించిన బరువుతో సరుకు రవాణా చేస్తున్న వాహనాలపై రవాణా శాఖ కొరడా ఝళిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి మొబైల్ స్క్వాడ్ బృందాల తనిఖీలు చేపట్టి.. ఓవర్ లోడ్తో వెళ్తున్న 100 వాహనాలను సీజ్ చేసినట్లు రవాణా శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. వాహనాల్లో అధిక లోడ్ వేసే క్వారీలు, రీచ్లు, కంపెనీలకు సైతం నోటీసులు జారీ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఓవర్లోడ్ తో రెండో సారి పట్టు బడితే వాహనం పర్మిట్తోపాటు డ్రైవర్ లైసెన్స్ను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, రోడ్డు భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని వెల్లడించారు. ఈ తనిఖీల్లో అన్ని జిల్లాల డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు, ఆర్టీవోలు, జిల్లా రవాణా శాఖ అధికారులు, ఎంవీఐ లు, ఏఎంవీఐలు పాల్గొన్నారు. కాగా, భారీ వాహనాలకు సంబంధించిన ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తేనున్నట్లు రవాణాశాఖ తెలిపింది.