Share News

లబ్ధిదారుల ఎంపిక

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:32 AM

మోడల్‌కాలనీ ఇళ్లకు లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని, అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందిస్తామని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

 లబ్ధిదారుల ఎంపిక
హుజూర్‌నగర్‌లో మోడల్‌ కాలనీ ఇళ్లను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మోడల్‌కాలనీ ఇళ్లకు లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని, అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందిస్తామని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలో నిర్మితమవుతున్న మోడల్‌కాలనీలో పనులను ఆయన ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌,, కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌, ఎస్పీ కొత్తపల్లి నర్సింహలతో కలిసి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడల్‌కాలనీలో పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. 8 వేల మంది ప్రజలు నివసించేలా 2,160 ఇళ్లను ఏకకాలంలో నిర్మించామని, మొదటి విడత 1,000 ఇళ్లను ఈ నెల 14న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేస్తామన్నారు. లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేస్తారని, ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యంతోనే సహపంక్తి భోజనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలనీ మధ్యనే సీఎం సభ ఉంటుందని, విజయవంతం చేయాలన్నారు. గతేడాది ఉగాది రోజున సన్నబియ్యం పథకం ఇక్కడే ప్రారంభించామని, ప్రస్తుతం ఉగాది పండగ నేపథ్యంలో మోడల్‌కాలనీ ఇళ్లు అందిస్తున్నట్లు తెలిపారు. హుజూర్‌నగర్‌ మోడల్‌కాలనీ రాష్ట్రంలోనే అతిపెద్దకాలనీగా అవతరించబోతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులకు ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఒక్కరూపాయి తీసుకోకుండా ఉచితంగా ఇళ్లు అందిస్తోందన్నారు. గత ప్రభుత్వం మోడల్‌కాలనీని నిర్లక్ష్యం చేసిందని, డంపింగ్‌ యార్డుగా మార్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశామన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మునిసిపల్‌ ఛైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌, వైస్‌చైర్మన్‌ తన్నీరు మల్లికార్జున్‌రావు, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ కవిత, కమిషనర్‌ శ్రీనివాస్‌, హౌసింగ్‌ పీడీ సిద్ధార్థ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమరబోయిన శ్రీనివాస్‌, డీఈ వెంకటకృష్ణయ్య, దొంగరి వెంకటేశ్వర్లు, గూడెపు శ్రీనివాసు, సంపత్‌రెడ్డి, గెల్లి రవి, శ్రీనివాసరెడ్డి, హరిబాబు, మోహన్‌యాదవ్‌, ఉపేందర్‌, మహేష్‌, శివరామ్‌, శివ పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 12:32 AM