ఐఫోన్, కత్తి ఎక్కడ?
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:25 AM
ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో క్లౌడ్ రీజియన్ను ప్రారంభించింది. దేశంలో ఇప్పటికే పుణె, చెన్నై, ముంబైలో మూడు క్లౌడ్ రీజియన్లు పనిచేస్తున్నాయి.
నేరం చేయలేదన్నప్పుడు సాక్ష్యాలు ఎందుకు దాస్తున్నావు?
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణను స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
దాటవేసే ధోరణిలో ట్రైనీ ఐపీఎస్ సమాధానాలు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేఽధింపులు, హత్యాయత్నం కేసులో నిందితుడు, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కొంతసేపు స్వయంగా ప్రశ్నించారు. ట్రైనీ మహిళా ఐపీఎస్ తో పరిచయం, ఆయన ఫోన్, బెదిరించిన కత్తి ఎక్కడ, సాక్ష్యాలు ఎందుకు దాచిపెడుతున్నావన్న అంశాలపై విచారించారు. కోర్టు అనుమతితో ఉదయ్కృష్ణను కస్టడీలోకి తీసుకున్న అత్తాపూర్ పోలీసులు.. గురువారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అరెస్టుకు ముందు ట్రైనీ మహిళా ఐపీఎస్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని, తన ఫోన్లో సందేశాలు, వీడియోలు సహా అన్నిరకాల ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ఉదయ్ కృష్ణ సూసైడ్ నోట్ రాసిన విషయం తెలిసిందే. కానీ ఆయనకు సంబంధించిన ఐఫోన్ ఇప్పటివరకు పోలీసులకు అందజేయలేదు. ఈ క్రమంలో సదరు ఐఫోన్ విషయంలో ఉదయ్ కృష్ణను పోలీసులు లోతుగా ప్రశ్నించినట్టు తెలిసింది. ట్రైనీ మహిళా ఐపీఎస్ చేసిన ఆరోపణలు, ప్రతిగా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయని ఉదయ్ కృష్ణ చెప్పిన అంశాలు, పోలీస్ అకాడమీలో ఆమెను బెదిరించేందుకు వాడిన కత్తిని ఎక్కడ దాచారు? తదితర అంశాలపై ఆరాతీసినట్టు సమాచారం. కానీ ఈ ప్రశ్నలన్నింటికి కూడా ఉదయ్ కృష్ణారెడ్డి దాటవేసే ధోరణిలో సమాధానాలు చెప్పినట్టు తెలిసింది.
స్వయంగా ప్రశ్నించిన సజ్జనార్..
గురువారం సాయంత్రం అత్తాపూర్ పోలీస్టేషన్కు వెళ్లిన సీపీ సజ్జనార్.. పోలీసులు ఉదయ్కృష్ణారెడ్డిని విచారిస్తున్న తీరును పరిశీలించారు. సుమా రు 2గంటల పాటు అక్కడే ఉన్నారు. ట్రైనీ మహిళా ఐపీఎస్ తో పరిచయం, ఆమె చేసిన ఆరోపణలు, ఉదయ్ ఫోన్ ఎక్కడ? నిరపరాధిని అంటున్నప్పుడు దాన్ని రుజువు చేసుకోగల ఆధారాలను ఎందుకు దాచాల్సి వస్తోందన్న అంశాలపై ఉదయ్ కృష్ణారెడ్డిని సజ్జనార్ ప్రశ్నించినట్లు తెలిసింది.