నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 06:13 AM
క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై టీపీసీసీ దృష్టి సారించింది. సంఘటన్ సృజన్ అభియాన్లో భాగంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి గ్రామ, మండల, టౌన్, డివిజన్ స్థాయి వరకు కమిటీల నియామకాన్ని...
బూత్ నుంచి డివిజన్ స్థాయి వరకు కాంగ్రెస్ కమిటీలు
హర్కార చైర్మన్గా ‘ప్రొటోకాల్ కమిటీ’ ఏర్పాటు
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై టీపీసీసీ దృష్టి సారించింది. సంఘటన్ సృజన్ అభియాన్లో భాగంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి గ్రామ, మండల, టౌన్, డివిజన్ స్థాయి వరకు కమిటీల నియామకాన్ని సమన్వయం చేసుకునేందుకు నియోజవకర్గాల వారీగా సమన్వయకర్తలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆదివారం నియమించారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ కోఆర్డినేటర్లను నియమించారు. ఈ కంట్రోల్ రూమ్ కోఆర్టినేటర్లు, నియోజకవర్గస్థాయి కోఆర్డినేటర్లు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఎంపీలతో సంప్రదింపులు జరిపి కమిటీల నియామకం చేపట్టనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు, కార్యకర్తలతో పార్టీని బలోపేతం చేసేందుకు ఏఐసీసీ ఈ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్రావు చైర్మన్గా టీపీసీసీ ప్రోటోకాల్ సమన్వయ కమిటీని మహేశ్గౌడ్ నియమించారు. ఈ కమిటీకి వైస్చైర్మన్గా పార్టీ నేత కిషోర్రెడ్డి, కన్వీనర్గా ఫుడ్ కమిషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, సభ్యులుగా పార్టీ నేతలు భానుప్రకాశ్రెడ్డి, ప్రసాద్, సూరజ్ తివారి, మహేందర్, అల్లం రాకేశ్ను నియమించారు.