నేటి నుంచి మహేశ్ గౌడ్ జిల్లాల పర్యటన
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:09 AM
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. కొత్తగా ఏర్పాటైన డీసీసీ ...
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. కొత్తగా ఏర్పాటైన డీసీసీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మహేశ్ గౌడ్.. జిల్లాల పర్యటనను గతంలోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తన జిల్లా పర్యటనకు విరామం ఇచ్చారు. శుక్రవారం నుంచి తన పర్యటనను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో నాలుగు జిల్లాలు పర్యటించి.. ఆయా డీసీసీల కార్యవర్గాలతో సమావేశమవుతారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై ఈ సమావేశాల్లో దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, గాంధీభవన్లో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమం టీపీసీసీ కల్లు గీత కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కాంగ్రెస్ నేతలు, కల్లు గీత కార్మిక విభాగం కార్యవర్గ సభ్యులు.. పాపన్న చిత్రపటానికి నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వీరుడు పాపన్న అంటూ మహేశ్ గౌడ్ ఓ ప్రకటనలో కొనియాడారు.