kumaram bheem asifabad-నిండా నిర్లక్ష్యం
ABN , Publish Date - Jan 14 , 2026 | 10:17 PM
జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అడ పెద్దవాగుపై నిర్మించిన కుమరం భీం ప్రాజెక్టుపై అధికారులు, పాలకులకు పట్టింపు కరువైంది. పనులు ప్రారంభించి పుష్కర కాలం దాటినా నేటికి పంటలకు నీరందక పోవడంతో ఆయకట్టు దారులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2005లో 10 టీఎంసీల సామర్థ్యంతో 45వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూ. 450 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. 2011లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రధాన కాలువలు కొంత మేర పూర్తయినా భారీ వర్షాలకు గండ్లు పడ్డాయి. దీంతో రైతులకు పంటకు నీరు అందని దుస్థితి నెలకొన్నది.
- ఆనకట్ట దెబ్బతిన్నా పట్టింపు కరువు
- పంటలకు నీరు అందక అన్నదాతల అవస్థలు
ఆసిఫాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అడ పెద్దవాగుపై నిర్మించిన కుమరం భీం ప్రాజెక్టుపై అధికారులు, పాలకులకు పట్టింపు కరువైంది. పనులు ప్రారంభించి పుష్కర కాలం దాటినా నేటికి పంటలకు నీరందక పోవడంతో ఆయకట్టు దారులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2005లో 10 టీఎంసీల సామర్థ్యంతో 45వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూ. 450 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. 2011లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రధాన కాలువలు కొంత మేర పూర్తయినా భారీ వర్షాలకు గండ్లు పడ్డాయి. దీంతో రైతులకు పంటకు నీరు అందని దుస్థితి నెలకొన్నది.
- ప్రధాన కాలువల పూర్తిపై..
ప్రాజెక్టు ప్రధాన కాలువలను పూర్తి చేయడంపై అధికారులకు పట్టింపు కరువైంది. వాంకిడి మండలం మీదుగా వెళ్లే ఎడమ కాలువ 65 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. నవేగూడ, ఇంధాని, ఖిరిడి, సరండి, వాంకిడి, ఖమాన, జంబుల్దరి, లక్ష్మీపూర్, వెల్గి, ఖేడెగాం, ఖనర్గాం గ్రామాల మీదుగా ఆసిఫాబాద్ మండలం భీంపూర్, గుండి, తదితర గ్రామాలతో పాటు కాగజ్నగర్ మండలంలోని పలు వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరు అందించాల్సి ఉంది. జిల్లాలో గతంలో కురిసిన బారీ వర్షాలకు ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువ చిన్న వాంకిడి వద్ద గండి పడింది. కేవలం మట్టితో చదును చేసి అలాగే వదిలి వేయడంతో నీటిని విడుదల చేయడంలేదు. మోకాసిగూడ నుంచి వాంకిడి వరకు కాలువ అనేక చోట్ల సిమెంట్ లైనింగ్ కూలిపోయింది. కాలువల్లో పిచ్చి మొక్కలు, చెత్తచెదారం, పూడిక పెరుకు పోయి అధ్వానంగా మారాయి. కుడి కాలువ నిర్మాణం పూర్తయి ఐదేళ్లు గడిచినా ప్రారంభంలోనే కూలి పోవడంతో నీటిని వదలడంలేదు. మానిక్గూడ గ్రామ సమీపంలో కుడి కాలువ కోతకు గురవుతోంది. దీంతో ఆయకట్టుదారులకు నీరందక పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. జూలై, 2022లో కురిసిన భారీ వర్షాలకు ఆనకట్ట దెబ్బతింది. నిర్మాణ సంస్థ ప్రాజెక్టు పనులను నాసిరకంగా చేపట్టడంతో భారీ వర్షాలకు ఆనకట్ట కుంగి బీటలు వారింది. వరద ఉధృతికి కుడివైపు చివరి భాగంలో 300 మీటర్ల మేర దెబ్బతిని రాళ్ళు, మట్టి కొట్టుకుపోయి బలహీనంగా మారింది. నీటి తాకిడికి ఆనకట్ట కుంగిపోయింది. దీంతో ఇంజనీరింగ్ అధికారులు పాలిథిన్ కవర్లు కప్పారు. మూడేళ్లు గడుస్తున్నా మరమ్మతు పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది.
- 10 టీఎంసీల నిలువ సామర్థ్యంతో..
కుమరం భీం ప్రాజెక్టును 10 టీఎంసీల నిలువ సామర్థ్యంతో నిర్మించారు. కానీ ఆనకట్ట దెబ్బతినడంతో 5.8 టీఎంసీలకు మించి నీటిని నిలువ చేయడంలేదు. వరదనీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరుతున్న గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులు తున్నారు. ఆసిఫాబాద్ మండలంలో కుడి కాలువ ద్వారా 6వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 39వేల ఎకరాలు ఆసిఫాబాద్ మండలంతో పాటు వాంకిడి, కాగజ్నగర్ మండలాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రాజెక్టు నిలువ సామర్థ్యం తగ్గించడం, కాలువలు అధ్వానంగా మారడంతో పంట పొలాలకు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. ప్రాజెక్టులోని నీరు ప్రస్తుతం మిషన్ భగీరథకు చేపల పెంపకం కోసం మాత్రమే ఉపయోగపడుతోంది.