kumaram bheem asifabad- ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - May 31 , 2026 | 11:08 PM
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటన సోమవారం ఉన్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగజ్నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముస్తాబైంది. కలెక్టర్ హరిత, అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎస్పీ నితికా పంత్ పర్యవేక్షిస్తున్నారు. సుమారు 60 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేస్తున్నారు.
- 60 ఎకరాల్లో బహిరంగ సభ
- ట్రాఫిక్ దారి మళ్లింపునకు అధికారుల చర్యలు
రెబ్బెన, మే 31 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటన సోమవారం ఉన్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగజ్నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముస్తాబైంది. కలెక్టర్ హరిత, అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎస్పీ నితికా పంత్ పర్యవేక్షిస్తున్నారు. సుమారు 60 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల స్థలం కోసం 25 ఎకరాల్లో సభను ఏర్పాటు చేశారు. ఈ మేరకు కాగజ్నగర్ ఎక్స్రోడ్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్, పార్కింగ్ ప్రాంతాల నిబంధనలు ప్రజలు తప్పకుండా పాటించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. మంచిర్యాల నుంచి వచ్చే వారికి ఇందిరనగర్ దాటిన తర్వాత ఎడమవైపు(పబ్లిక్మీటింగ్ సభ ప్రాంగణం ముందు) పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ నుంచి వచ్చే వారికి కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద సర్వీస్ రోడ్డుకు ఎడమ వైపున(కాగజ్నగర్ కాటన్ మిల్లుకు ముందు భాగంలో) వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక కాగజ్నగర్ నుంచి వచ్చే వారికి ఎడమవైపు ముందు భాగంలో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కాగజ్నగర్ ఎక్స్రోడ్డు వద్ద సర్వీసు రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణ అమల్లో ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. సర్వీస్ రోడ్డుపైన భారీ వాహనాలకు అనుమించకుండా పక్కా ఏర్పాట్లు చేశారు. అలాగే కాగజ్నగర్ నుంచి ఎక్స్రోడ్డు వైపు వచ్చే వాహనాలకు, కాగజ్నగర్ ఎక్స్రోడ్డు నుంచి కాగజ్నగర్ వైపు వెళ్లే భారీ వాహనాలను సీఎం మీటింగ్ పూర్తి అయ్యే వరకు అనుమతించకుండా నిలిపివేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కెరమెరి నుంచి ఆసిఫాబాద్ వైపు అలాగే ఆసిఫాబాద్ నుంచి కెరమెరి వైపు భారీ వాహనాలను అనుమతించమని ఈ మేరకు మైకు ద్వారా ప్రచారం చేపట్టారు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన నాయకులు..
సీఎం సభ ఉన్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు, ఆదిలాబాద్ ఎంఎల్సీ దండే విఠల్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఎం సభా స్థలం ప్రాంగణం, కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్, వాహనాల పార్కింగ్పై అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచనలు చేశారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుగుణ తదితరులు ఉన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): కెరమెరి మండలం కోటారి గ్రామ పంచాయతీ కొత్తగూడెం సోమవారం సీఎం పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, వేదిక నిర్మాణం, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యలు, పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలను ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన విజయ వంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంవట ఎమ్మెల్సీ దండె విఠల్, గ్రంథాలయ చైర్మన్ అనీల్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు శ్యాంనాయక్, సుగుణక్క, మునీర్, మల్లేష్, బాలేష్గౌడ్, తదితరులు ఉన్నారు.