సిద్దిపేట జిల్లా కోహెడలో ఐదు ఆవులను చంపిన పెద్దపులి
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:55 AM
సిద్దిపేట జిల్లాలో పెద్దపులి సంచారంతో అక్కడి గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. కోహెడ మండలం బస్వాపూర్ ఆరెపల్లి తండాలో పులి ఏకంగా ఐదు ఆవులను చంపేసింది.
నంగునూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లాలో పెద్దపులి సంచారంతో అక్కడి గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. కోహెడ మండలం బస్వాపూర్ ఆరెపల్లి తండాలో పులి ఏకంగా ఐదు ఆవులను చంపేసింది. అంతకుముందు ఆదివారం తెల్లవారుజామున నంగునూరు మండలం ఘనపూర్లో ఓ లేగ దూడను చంపింది. యాదాద్రి జిల్లా నుంచి ఈ పులి జనగామ జిల్లా అమ్మపురం మీదుగా సిద్దిపేట జిల్లాలోని దూల్మిట్ట, మద్దూరు మండలాలకు చేరుకుని అక్కడి నుంచి నంగునూరు మండలం మీదుగా కోహెడలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇదే పులి శనివారం మద్దూరు మండలం లద్నూర్, అమ్మాపూర్ గ్రామాల్లో లేగదూడలపై దాడి చేసింది. తాజా దాడి విషయం తెలుసుకున్న హుస్నాబాద్ ఎఫ్ఆర్వో సిద్ధార్థ్ రెడ్డి నంగునూరులో ఘటనా స్థలాన్ని చేరుకొని పరిసర ప్రాంతాల్లో పులి సంచరించిన పాదముద్రలను ధృవీకరించారు. ప్రస్తుతం అటవీశాఖ బృందాలు డ్రోన్ల సాయంతో పులి కోసం గాలిస్తున్నాయి.