29 రోజులు.. 403 కిలోమీటర్లు
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:28 AM
గౌతమబుద్ధుని శాంతి సందేశంతో ప్రజలను చైతన్యవంతం చేస్తూ గతనెల 1వ తేదీన కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో ప్రాంభమైన మూడో దమ్మ పాదయాత్ర 29 రోజులు..
బుద్ధవనం చేరుకున్న దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): గౌతమబుద్ధుని శాంతి సందేశంతో ప్రజలను చైతన్యవంతం చేస్తూ గతనెల 1వ తేదీన కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో ప్రాంభమైన మూడో దమ్మ పాదయాత్ర 29 రోజులు.. 403 కిలోమీటర్లు సాగి ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ బుద్ధవనానికి చేరుకుంది. ఈ పాదయాత్రకు సాగర్ ఎమ్మెల్యే కె. జైవీర్రెడ్డి, బుద్ధవనం ప్రత్యేక అఽధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆశోక చక్రం వద్ద బౌద్ధ భిక్షువుల కాళ్లు కడిగించారు. థాయ్లాండ్ నుంచి బౌద్ధ దమ్మ పాదయాత్ర ద్వారా తీసుకువచ్చిన బుద్ధ ధాతువులను బుద్ధవనం ప్రధాన ద్వారం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి మహాస్థూపం లోపల ధ్యాన మందిరంలో ఉంచారు. ఈ ధాతువులను మూడు రోజుల పాటు సందర్శకులకు అందుబాటులో ఉంచుతామని ప్రత్యేక అఽధికారి లక్ష్మయ్య తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం సాగర్లోని బుద్ధవనానికి రానున్నారని మల్లేపల్లి ఆయన తెలిపారు.