శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:45 AM
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మన రాష్ట్రం సహా ఏపీలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలను సందర్శించే భక్తుల కోసం టీజీఎ్సఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మన రాష్ట్రం సహా ఏపీలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలను సందర్శించే భక్తుల కోసం టీజీఎ్సఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. 15న మహా శివరాత్రి కాగా 14 నుంచి 16వ తేదీ వరకు బస్సులను సంస్థ నడపనుంది. ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, వనదుర్గ కొలువైన ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71 బస్సులను నడపనుంది. అలాగే కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప తదితర ఆలయాలకు 273 బస్సులను ఏర్పాటు చేసింది. ఏడుపాయలకు మాత్రం 15 నుంచి 17వ తేదీ వరకు స్పెషల్ బస్సులు తిరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకునేవారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని సంస్థ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. టికెట్ల బుకింగ్ను ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tgsrtcbus.inలో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రత్యేక బస్సులకు కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లలో సంప్రదించవచ్చునని ఎండీ సూచించారు. కాగా ప్రత్యేక బస్సుల్లో సాధారాణ చార్జీలతో పోలిస్తే 1.5 రెట్ల వరకు ధరలు పెంచారు. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ప్లే బోర్డుల్ని ఏర్పాటు చేయనున్నారు.