కుల దూషణ, మహిళా పోలీసుల పట్ల అనుచిత ప్రవర్తనలపై నివేదికివ్వండి
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:36 AM
శాసన స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు, అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా పోలీసుల ఎదుట బీఆర్ఎస్ నేతలు చొక్కాలు విప్పడం, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పాలు, పసుపు నీళ్లతో శుద్ధి ఘటనలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) స్పందించింది.
డీజీపీకి హెచ్ఆర్సీ ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): శాసన స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు, అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా పోలీసుల ఎదుట బీఆర్ఎస్ నేతలు చొక్కాలు విప్పడం, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పాలు, పసుపు నీళ్లతో శుద్ధి ఘటనలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) స్పందించింది. కుల దూషణలు, మహిళా పోలీసుల పట్ల అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు సమర్పించాలని రాష్ట్ర డీజీపీని శుక్రవారం ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను మీడియా సమక్షంలో అసభ్య పదజాలంతో దూషించడంపై జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, ఇతరులు హెచ్ఆర్సీకి ఫిర్యాదులు చేశారు. అలాగే, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట దళితులు నిరసన చేపట్టిన సమయంలో బీఆర్ఎస్ నాయకురాలిగా పేర్కొన్న పావని గౌడ్, ఇతరులు పసుపు నీళ్లు, పాలతో ఆ ప్రాంతాన్ని ‘శుద్ధి’ చేశారని, దళిత నిరసనకారులను దూషించారని కూడా తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఇందిరా శోభన్ చేసిన ఫిర్యాదులో.. అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు తమ నల్ల టీషర్టులు తొలగించి విధుల్లో ఉన్న మహిళా పోలీసుల సమక్షంలో అర్ధనగ్నంగా నిలబడ్డారని తెలిపారు. ఈ ఘటనతో మహిళా పోలీసులు మానసిక వేదనకు గురయ్యారని, వారికి అవమానం కలిగిందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రెండు ఫిర్యాదులపై రికార్డులను పరిశీలించిన కమిషన్.. డీజీపీ నుంచి నివేదికలు కోరింది. తదుపరి విచారణను అక్టోబరు 9కు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ ఆహార పదార్థాలను మిక్సర్లో వేయకండి.!