విద్యుత్ సౌధ నుంచి థర్మల్ ప్లాంట్లకు 500 మంది!
ABN , Publish Date - May 22 , 2026 | 03:55 AM
తెలంగాణ జెన్కోలో ఉద్యోగులు/అధికారుల హేతుబద్ధీకరణ చేపట్టాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం కేటీపీఎస్, కేటీపీపీలో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారు.
జెన్కో లో ఉద్యోగుల హేతుబద్ధీకరణ.. అధ్యయనానికి కమిటీ
హైదరాబాద్, మే 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ జెన్కోలో ఉద్యోగులు/అధికారుల హేతుబద్ధీకరణ చేపట్టాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం కేటీపీఎస్, కేటీపీపీలో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారు. ఇక విద్యుత్సౌధ లో ఏకంగా 700మంది పని చేస్తున్నారు. యాదాద్రిలో 40శాతం ఉద్యోగుల కొరత ఉండగా, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 30శాతం ఉద్యోగుల కొరత ఉంది. ఈ అంశాలను పరిశీలించిన జెన్కో ఉన్నతాధికారులు ఉద్యోగులు హేతుబద్ధీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా విద్యుత్ సౌధ నుంచి 500మందిని యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లకు పంపించే యోచనలో ఉన్నారు. ఉద్యోగుల సర్దుబాటు చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని జెన్కో నియమించింది. ఏయే ప్లాంట్లలో ఏమేరకు ఉద్యోగులు కావాలి? వంటి అంశాలపై ఆ కమిటీ అధ్యయనం చేయనుంది.