ఏమిటిది ఉపాధ్యాయులు బెదిరే‘టెట్టు’?
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:55 AM
రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హతపరీక్ష (టెట్)లో ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించాలని లేదంటే వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ....
2 ఏళ్లలో టెట్ పాస్ కావాలనే తీర్పుతో టీచర్లలో ఆందోళన
సుప్రీంకోర్టు తీర్పుపై వెంటనే జోక్యం చేసుకోవాలి
కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్,కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఏఐ జాక్టో విజ్ఞప్తి
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హతపరీక్ష (టెట్)లో ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించాలని లేదంటే వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ గత ఏడాది సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా దేశవ్యాప్తంగా 30 లక్షల మంది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఏఐ జాక్టో) ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, అవసరమైతే చట్ట సవరణ ద్వారానైనా సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని, అదే విధంగా టెట్ సిలబస్, అర్హతమార్కుల విషయంలో సడలింపు ఇవ్వాలని ఏఐ జాక్టో ప్రతినిధులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కోరారు. ఏఐ జాక్టో స్టీరింగ్ కమిటీసభ్యులు సీఎన్ భార్తి, చావ రవి, కత్తి నరసింహారెడ్డి, బసవరాజ్ గురికార్, కమలాకాంత త్రిపాఠి శుక్రవారం పార్లమెంటులో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి టెట్ సమస్యను వివరించి పరిష్కారానికి కృషి చేయాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని ఏ ఐజాక్టో నాయకులు తెలిపారు.