తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు మంచిది కాదు
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:04 AM
తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదని, కూటమి పెద్దగా చొరవ తీసుకుని.. రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ....
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదని, కూటమి పెద్దగా చొరవ తీసుకుని.. రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ, జనసేన పార్టీల నేతలను కట్టడి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు మంగళవారంనాడు లేఖ రాశారు. పార్లమెంటు వేదికగా అందరి ఆమోదంతో రాజ్యాంగ, చట్టబద్ధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి పుష్కర కాలం దాటిందంటూ ఆ లేఖలో పొన్నం గుర్తుచేశారు. విడిపోయిన తర్వాతా ఇరు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసుంటున్నారని, పెళ్లి సంబంధాలూ కుదుర్చుకుంటున్నారని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలూ పోటీ పడి అభివృద్ధి చెందుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగానూ నిలిచాయన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర విభజనపై వివాదాస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదన్నారు.