పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:29 AM
పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు.
డావోస్లో సీఎం రేవంత్తో ఏపీ మంత్రి లోకేశ్ భేటీ
హైదరాబాద్/అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్లోని డావోస్లో జరగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్) వేదికగా గురువారం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ను మంగళగిరి శాలువాతో లోకేశ్ సత్కరించి.. జ్ఞాపికను అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ కూడా లోకేశ్ను సత్కరించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ విద్యాశాఖలో చేపట్టిన ప్రగతి సంస్కరణలు, ఐటీ ప్రగతి గురించి రేవంత్కు లోకేశ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యకు నమూనాగా మారిందని, విద్యారంగంలో చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. తెలంగాణలో తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రేవంత్ వివరించారు. ఐటీఐలను స్కిల్ క్యాంప్సలుగా తీర్చిదిద్దామని.. వాటిని సందర్శించాలని లోకేశ్ను ఆహ్వానించారు. మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకోవాలని లోకేశ్ను కోరారు. పెట్టుబడుల సాధనలో పోటీ పడి దేశానికే తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవనున్నాయని ఇరువురు నేతలూ వ్యాఖ్యానించారు.