రేపటి నుంచి వర్షాలు
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:45 AM
రాష్ట్రంలో సోమవారం నుంచి బుధవారం వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు కురిసే అవకాశం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సోమవారం నుంచి బుధవారం వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆదివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
అలాగే రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని పేర్కొంది. మరోవైపు 28 జిల్లాల్లో శనివారం 40-43 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో అత్యధికంగా 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.