బియ్యం ఉత్పత్తిలో పదో వంతు మాత్రమే వినియోగం
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:49 AM
రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి మొత్తం 3 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం దిగుబడి వస్తుండగా.. దానిలో పదో వంతు మాత్రమే వినియోగిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల....
3 కోట్ల మెట్రిక్ టన్నులతో దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ
ఎగుమతులను ప్రోత్సహిస్తామన్న మంత్రి ఉత్తమ్
బంజారాహిల్స్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి మొత్తం 3 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం దిగుబడి వస్తుండగా.. దానిలో పదో వంతు మాత్రమే వినియోగిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అందువల్ల బియ్యం పరిశ్రమ అభివృద్ధికి ఎగుమతులే తదుపరి పెద్ద అవకాశంగా మారాయని తెలిపారు. టెక్నో సర్వ్ సంస్థ ఆధ్వర్యంలోని మిల్లర్స్ ఫర్ న్యూట్రిషస్ లిమిటెడ్ సహకారంతో కేసీపీ న్యూట్రి ఫోర్టిఫైడ్ రైస్ శ్రేణిని మంత్రి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్క్షా్పలో ఆయన మాట్లాడుతూ.. బియ్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. బియ్యం ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోందని చెప్పారు. బహుళ విటమిన్లతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యం ఉత్పత్తులకు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. సాధారణ బియ్యంలానే రుచి, లక్షణాలు కలిగి ఉండి, ఎనిమిది కీలక సూక్ష్మపోషకాలను ఫోర్టిఫైడ్ బియ్యం అందిస్తుందన్నారు.