ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరు నెలల్లో డిజిటల్ హెల్త్ కార్డులు
ABN , Publish Date - Apr 20 , 2026 | 06:07 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరు నెలల్లో డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి ఎంపిక: దామోదర
బర్కత్పుర, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరు నెలల్లో డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదురహిత వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాను ఎంపిక చేశామని, త్వరలో అన్ని జిల్లాల్లో హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అన్ని రకాల వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, తెలంగాణ రాబోయే రోజులలో హెల్త్ హబ్గా మారి దేశానికే ఆదర్శంగా నిలవబోతుందని చెప్పారు. రాష్ట్రంలో వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన లేజర్ పరికరాలు చర్మ వైద్యరంగంలో కొత్త శకానికి నాంది పలుకుతాయని ఆయన పేర్కొన్నారు.