రేపటి నుంచి ‘వాహన్’లోనే ఆర్సీల జారీ
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:31 AM
వాహన్ పోర్టల్ సేవల విస్తరణలో భాగంగా శనివారం నుంచి వాహన శాశ్వత రిజిస్ట్రేషన్(ఆర్సీ)లను ఆన్లైన్లోనే జారీ చేయనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు..
మరింత సులభతరంగా సేవలు: రవాణాశాఖ
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : వాహన్ పోర్టల్ సేవల విస్తరణలో భాగంగా శనివారం నుంచి వాహన శాశ్వత రిజిస్ట్రేషన్(ఆర్సీ)లను ఆన్లైన్లోనే జారీ చేయనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘వాహన్’ పోర్టల్లో తెలంగాణ చేరిన తర్వాత నుంచీ తాత్కాలిక రిజిస్ట్రేషన్లు(టీఆర్లు) మాత్రమే చేస్తున్నారు. వాణిజ్య వాహనాలు కాకుండా ఇతర ఏ వాహనమైనా గత మార్చి 23 నుంచి సదరు వాహన డీలర్ వద్దే తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది డీలర్లకు శిక్షణ అందించారు. దాదాపు 33 వేల వాహనాలకు టీఆర్ నంబర్లు కేటాయించారు. వాహనదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ఇక నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ సైతం ‘వాహన్’ ద్వారానేనే చేపట్టనున్నారు. వాహనదారులు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్)లను ్ఛ్ఠ్టూ ఎ్ఛుఽ ఝ ్క్చటజీఠ్చిజ్చిుఽ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రవాణా శాఖకు సంబంధించి మరిన్ని అదనపు సేవలను దశలవారీగా యాప్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ‘‘వాహన్ పోర్టల్ ఆధారిత రిజిస్ట్రేషన్ అమలు రవాణా శాఖలో డిజిటల్ మార్పునకు ఒక ముఖ్యమైన అడుగు. ఇది పారదర్శకతను పెంచి, పౌరులకు సులభమైన సేవలను అందిస్తుంది’’ అని రవాణా శాఖ ఉన్నతాధికారి తెలిపారు.