Share News

ఆర్టీసీని విస్తరిస్తాం.. కనెక్టివిటీ పెంచుతాం: పొన్నం

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:12 AM

తెలంగాణ ఆర్టీసీని మరింత విస్తరిస్తామని, హైదరాబాద్‌తో పాటు గ్రామాలకు కనెక్టివిటీని పెంచుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

ఆర్టీసీని విస్తరిస్తాం.. కనెక్టివిటీ పెంచుతాం: పొన్నం

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్టీసీని మరింత విస్తరిస్తామని, హైదరాబాద్‌తో పాటు గ్రామాలకు కనెక్టివిటీని పెంచుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆర్టీసీపై మూడు రోజుల పాటు సమీక్షలో భాగంగా తొలి రోజు, బుధవారం నల్లగొండ, మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితోపాటు ఆ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కోదాడ, హుజూర్‌నగర్‌ బస్‌ స్టేషన్‌ల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరారు. గుర్రంగూడలో నైట్‌ హాల్ట్‌ బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని, మిర్యాలగూడ, హాలియా, మైసంపల్లి మధ్య అదనపు బస్సులను నడపాలని ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి కోరారు. తుంగతుర్తికి ఆర్టీసీ బస్సు డిపోను మంజూరు చేయాలని, సూర్యాపేట, హనుమకొండ, యాదగిరిగుట్ట బస్సులు మోత్కూరు, తుంగతుర్తిలో ఆగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మందుల సామేలు అడిగారు. నారాయణఖేడ్‌, పెద్ద శంకరంపేట బస్‌ ేస్టషన్లను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి కోరారు. కుత్బుల్లాపూర్‌లోని జగద్గిరిగుట్టలో ఆర్టీసీ బస్సుల పార్కింగ్‌కు ఏర్పాటు చేయాలని, కుత్బుల్లాపూర్‌, దుండిగల్‌, గండిమైసమ్మ, బాచుపల్లి, నిజాంపేట్‌ రూట్‌లో అదనపు బస్సులు నడపాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అడిగారు. మల్కాజిగిరి నుంచి మచ్చ బొల్లారం-చార్మినార్‌, ఈసీఐఎల్‌, మౌలాలి, ఆర్టీసీ కాలనీ, సికింద్రాబాద్‌ రూట్లలో బస్సులు. జూబ్లీ బస్టాండ్‌ను మోడల్‌ బస్టాండ్‌గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే శ్రీగణేష్‌ సూచించారు. కాగా, ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ఆర్టీసీ అధికారులు నివేదిక రూపొందిస్తారని, అనంతరం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ హామీ ఇచ్చారు. గురువారం మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో, శనివారం కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులతో ఇదే తరహా సమావేశాలు నిర్వహించనున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 05:12 AM