ప్రభుత్వ టీచర్లకు ఏడాదికి 4 సార్లు టెట్
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:29 AM
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత సాధించేందుకుగాను ప్రభుత్వ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. ఐదేళ్లకన్నా ఎక్కువ సర్వీసు ఉన్న...
ప్రత్యేక అవకాశం ఇచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత సాధించేందుకుగాను ప్రభుత్వ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. ఐదేళ్లకన్నా ఎక్కువ సర్వీసు ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు గత ఏడాది ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2028 ఆగస్టులోపు టెట్ అర్హత సాధించాలని గడువు విధించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు టెట్ రాసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. నిబంధనల ప్రకారం ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తున్నారు. కేవలం ప్రభుత్వ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఇక నుంచి ఏడాదికి నాలుగుసార్లు టెట్ నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. దీనికి సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా అంతకుముందు ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అవకాశాలు పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు సర్కారుకు వినతిపత్రాన్ని సమర్పించాయి. సర్వీసులో ఉన్న టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ శాసనసమండలి సభ్యుడు పింగిలి శ్రీపాల్ రెడ్డితోపాటు పీఆర్టీయు, ఎస్టీయు, టీఆర్టీఎఫ్ సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. అదనపు టెట్ నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్ హర్షం వ్యక్తం చేశారు.