అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్గా తెలంగాణ
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:40 AM
తెలంగాణను దేశంలోని అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్ల్లో ఒకటిగా తీర్చిదిద్దడానికి తమ సర్కారు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
2047 నాటికి ఈ రంగంలో తిరుగులేని శక్తిగా రాష్ట్రం
‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు
‘ట్రాన్స్ పోర్ట్ లాజిస్టిక్ ఇండియా 2026’ సదస్సులో మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను దేశంలోని అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్ల్లో ఒకటిగా తీర్చిదిద్దడానికి తమ సర్కారు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆ దిశగా మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ ఇంటిగ్రేషన్, పాలసీ అండ్ రెగ్యులేటరీ ఫెసిలిటేషన్, సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ లాజిస్టిక్స్, స్కిల్ డెవల్పమెంట్ అండ్ ఇన్నోవేషన్తో కూడిన ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ముంబైలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ‘మెస్సే ముంచెన్ ఇండియా (మెస్సే ముంచెన్ జర్మనీ అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో జరిగిన ‘ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్ ఇండియా-2026’ సదస్సులో ఆయన చెప్పారు. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కీలక రంగాల్లో ‘లాజిస్టిక్’లో 2047కల్లా రాష్ట్రాన్ని తిరుగులేని శక్తిగా మార్చడానికి ప్రభుత్వ చర్యలు, ప్రణాళికలను శ్రీధర్ బాబు వివరించారు. భౌగోళికంగా 11, జనాభా పరంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణకు జీడీపీలో 5ు వాటా ఉందన్నారు. దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచే సంకల్పంతోనే ‘తెలంగాణ రైజింగ్-2047’ డాక్యుమెంట్కు శ్రీకారం చుట్టినట్లు తెలిపిన శ్రీధర్ బాబు.. 3 ట్రిలియన్ల డాలర్లకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లడంలో లాజిస్టిక్దే కీలక పాత్ర అన్నారు. సప్లయ్ చైన్ పునర్నిర్మాణం, ఏఐ ఆధారిత ఇంటెలిజెంట్ లాజిస్టిక్, సస్టైనబిలిటీ అనే 3 ప్రధాన మార్పులు ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్ రంగాన్ని సమూలంగా మార్చేస్తున్నాయని తెలిపారు. ఈ తరుణంలో మనకున్న భౌగోళిక అనుకూలతలను ‘డిజైన్ అడ్వాంటేజ్’గా మార్చుకుని సత్తా చాటేలా ముందుకెళ్తున్నామని శ్రీధర్బాబు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో ఫేజ్-2, కొత్త ఎయిర్ పోర్టులు, డ్రై పోర్టు, తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ 2.0, లాజిస్టిక్ హబ్స్ తదితర ప్రాజెక్టులు ఈ రంగంలో రాష్ర్టాన్ని అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా మార్చుతాయనడంలో సందేహమే లేదన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో లాజిస్టిక్స్ రంగానికి అవసరమైన రెడీ టూ వర్క్ ఫోర్స్ను సిద్ధం చేస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. కేవలం వస్తువుల ఉత్పత్తే కాక.. ప్రపంచం ఊహించని వేగంతో వాటిని డెలివరీ చేసి ‘లాజిస్టిక్ పవర్ హౌస్’గా ఎదిగే సత్తా తెలంగాణకు ఉందని స్పష్టం చేశారు. మల్టీ మోడల్, రైల్ లింక్డ్ అసెట్స్, ఎయిర్ కార్గో, కోల్డ్ చైన్, గ్రేడ్ -ఏ వేర్ హౌజింగ్, ఆటోమేషన్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్, గ్రీన్ మొబిలిటీ తదితర కేటగిరీల్లో పెట్టుబడులు పెట్టి ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలసీలు, ప్రోత్సాహకర విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.