స్వశక్తి మహిళకు ‘చిలకపచ్చ’ చీరలు
ABN , Publish Date - May 07 , 2026 | 04:53 AM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ రెండో విడతలో భాగంగా, స్వశక్తి సంఘాల సభ్యులకు...
సిరిసిల్లలో ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్
7 జిల్లాల మరమగ్గాల పరిశ్రమకు కోటి ఆర్డర్లు
సిరిసిల్ల, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ రెండో విడతలో భాగంగా, స్వశక్తి సంఘాల సభ్యులకు ‘చిలకపచ్చ’ చీరలను పంపిణీ చేయనున్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈ కొత్త చీరలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలోని 130 మరమగ్గాల సొసైటీలకు 7కోట్ల మీటర్ల వస్త్రం, కోటి చీరల ఉత్పత్తికి సంబంధించిన ఆర్డర్లు అందించారు. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకే పరిమితమైన ఆర్డర్లను, ఈసారి రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు (రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జనగాం, యాదాద్రి) విస్తరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఆర్డర్ల వల్ల చేనేత కార్మికులకు ఆరు నుంచి ఏడు నెలల పాటు ఉపాధి లభిస్తుందని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడబోమని తెలిపారు.