Share News

ఉన్నత చదువులకని వెళ్లి తిరిగి రాని లోకానికి..

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:44 AM

తెలంగాణకు చెందిన ఓ యువకుడు లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్‌రెడ్డి(25) లండన్‌లో...

ఉన్నత చదువులకని వెళ్లి తిరిగి రాని లోకానికి..

  • లండన్‌లో తెలంగాణ యువకుడి మృతి

  • మృతుడు కామారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనాథ్‌ రెడ్డి

  • ఎంఎస్‌ చదివేందుకు గతేడాది లండన్‌కు

  • ఓ విందుకు వెళ్లొచ్చి నిద్రపోయిన తర్వాత మరణం

రాజంపేట, జూన్‌ 26 ( ఆంధ్రజ్యోతి): తెలంగాణకు చెందిన ఓ యువకుడు లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్‌రెడ్డి(25) లండన్‌లో తాను నివాసముంటున్న గదిలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. సావుసాని మధుసూదన్‌ రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు శ్రీనాథ్‌ రెడ్డి.. ఎంఎస్‌ చేసేందుకు గతేడాది లండన్‌ వెళ్లాడు. అక్కడి లీసెస్టర్‌ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఎంఎస్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. అయితే, ఈ నెల 22వ తేదీ రాత్రి ఓ ేస్నహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న శ్రీనాథ్‌.. విందు అనంతరం తాను నివాసముంటున్న గదికి తిరిగొచ్చి నిద్రపోయాడు. మరుసటిరోజు ఉదయం శ్రీనాథ్‌ రెడ్డి ఎంతసేపటికి నిద్ర లేవకపోయేసరికి రూమ్‌మేట్‌ దగ్గరకు వెళ్లి చూశాడు. శ్రీనాథ్‌ విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించి.. లండన్‌లో ఉంటున్న శ్రీనాథ్‌ బంధువులకు సమాచారం ఇచ్చారు. వారి ద్వారా శ్రీనాథ్‌ మరణ వార్త తలమడ్లలోని కుటుంబ సభ్యులకు తెలిసింది. విషయం తెలుసుకున్న శ్రీనాథ్‌ తల్లిదండ్రులు.. చేతికొచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో శోకసముద్రంలో మునిగిపోయారు.

Updated Date - Jun 27 , 2026 | 06:45 AM