రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలెందుకు?
ABN , Publish Date - Aug 15 , 2026 | 06:06 AM
రాష్ట్రంలో రేషన్కార్డు లబ్ధిదారులకు సరికొత్త భద్రతా ఫీచర్లతో స్మార్ట్కార్డులు జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. ఆ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు ఉండటంపై అభ్యంతరాలు వస్తున్నాయి.
మంత్రుల శాఖలు మారొచ్చు
రాజకీయ పరిణామాలు తారుమారు కావొచ్చు
ప్రతిసారీ కార్డులు మారుస్తారా?
విపక్షాలు, వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు
నేటి నుంచే స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ
సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి
రేషన్కార్డుల బియ్యంలో 90శాతం కేంద్రం ఇస్తున్నవే..
కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ముద్రించాలి
బీజేపీ ఎంపీలు రఘునందన్, అర్వింద్ డిమాండ్
హైదరాబాద్/న్యూఢిల్లీ/సంగారెడ్డి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రేషన్కార్డు లబ్ధిదారులకు సరికొత్త భద్రతా ఫీచర్లతో స్మార్ట్కార్డులు జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. ఆ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు ఉండటంపై అభ్యంతరాలు వస్తున్నాయి. సుదీర్ఘకాలం ఉండే రేషన్కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు ఉండటం ఏమిటని బీజేపీ సహా విపక్షాలు, వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి స్మార్ట్రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనుంది. ఈ కార్డులపై సీఎం రేవంత్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలను కూడా ముద్రించారు. ఈ క్రమంలో భవిష్యత్తులో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారినప్పుడు ఈ స్మార్ట్కార్డుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వంలో మార్పుల సంగతి వదిలేస్తే.. మంత్రులు, శాఖల మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ. అలా జరిగితే పాత రేషన్ స్మార్ట్ కార్డులను కొనసాగిస్తారా? మారుస్తారా? కొత్తకార్డులు ముద్రిస్తారా? ఒకవేళ కొనసాగించాలనుకుంటే.. కొత్తగా పదవిలోకి వచ్చిన మంత్రులు అంగీకరించగలరా? ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంటుందన్న అంశాలపై చర్చ జరుగుతోంది. ఒకవేళ కొత్త ప్రభుత్వాలు వచ్చినపుడు కార్డులు మార్చాల్సి వస్తుందని, అనవసరపు వ్యయభారమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం నుంచి పంపిణీ చేయనున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2.30గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు.
అనంతరం సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అంతకుముందు సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్గాంధీ విగ్రహాలను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరిస్తారు. ఇక సీఎం సభ కోసం రేషన్ లబ్ధిదారులతోపాటు ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేశారు. దాదాపు లక్ష మంది జన సమీకరణ కోసం బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాకు వెల్లడించారు. గత ఏడాదిన్నరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 61,08,544 మందికి లబ్ధికలిగేలా 16,32,810 కుటుంబాలకు రేషన్కార్డులు మంజూరుచేసింది. దీనితో రాష్ట్రంలో ఆహార భద్రత కార్డుల సంఖ్య 1,06,28,092కు, లబ్ధిదారుల సంఖ్య 3.43 కోట్లకు చేరింది.
రేషన్కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి: బీజేపీ
రాష్ట్రంలో పేదలకు అందించే బియ్యంలో చాలా వరకు కేంద్రమే అందజేస్తోందని, అందువల్ల రేషన్కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ముద్రించాలని బీజేపీ ఎంపీలు రఘునందన్రావు, ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలో రఘునందర్రావు, హైదరాబాద్లో అర్వింద్ మీడియాతో మాట్లాడారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం చొప్పున ఉచితంగా అందిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కిలో బియ్యం అందిస్తూ ఆర్భాటపు ప్రచారం చేసుకుంటోందని రఘునందన్రావు విమర్శించారు. ఒక్క కిలో బియ్యం ఇస్తూ కార్డుపై కాంగ్రెస్ నేతల ఫొటోలు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీని వెంటనే నిలిపేసి.. అన్ని కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించి, పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ఫోటోను ముద్రించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. స్మార్ట్ రేషన్కార్డుల ముద్రణలో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రేషన్కార్డుల ముద్రణ ఖర్చులు, టెండర్లు, కాంట్రాక్టు వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, పేదలకు అందించే రేషన్ బియ్యంలో 90శాతం నిధులు కేంద్రానివేనని.. ప్రొటోకాల్ ప్రకారం రేషన్కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ముద్రించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.