కరెంట్ షాక్ మృతులకు పరిహారం 8 లక్షలకు పెంపు
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:14 AM
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. కరెంట్ షాక్ మృతుల కుటుంబాలకు ఇప్పటిదాకా రూ.5 లక్షల పరిహారం ఇస్తుండగా దాన్ని...
జాప్యం వద్దు.. 2 నెలల్లో చెల్లించాలి.. ప్రమాదాల కారణాలపై నివేదిక ఇవ్వాలి
నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి
పేరుకుపోయిన కరెంట్ బిల్లుల బకాయి వసూలుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి
టారిఫ్ ఉత్తర్వుల్లో విద్యుత్ నియంత్రణ మండలి
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. కరెంట్ షాక్ మృతుల కుటుంబాలకు ఇప్పటిదాకా రూ.5 లక్షల పరిహారం ఇస్తుండగా దాన్ని రూ.8 లక్షలకు పెంచాలని ఆదేశించింది. ఈ నిర్ణయం ఈ నెల 1 నుంచి అమల్లోకి రానుంది. పరిహారాన్ని రెండు నెలల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రమాదాలకు కారణాలపై నివేదిక అందించాలని, నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు బుధవారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ ఉత్తర్వులు, డిస్కమ్లకు ఆదేశాలు ఇచ్చింది. ఏదైనా భారీ గృహసముదాయాలు, సొసైటీలకు సింగిల్ పాయింట్ కనెక్షన్ (ఒకే మీటర్ ఉంటే) వినియోగానికి బిల్లు ఎంత వచ్చిందో అంతే వసూలు చేయాలని, నిర్వహణ ఇతరత్రా చార్జీలను సొసైటీలు వసూలు చేయడానికి వీల్లేదని, దీన్ని ఉల్లంఘిస్తే జరిమానాలు విధించాలని హెచ్చరించింది. కరెంట్ బిల్లుల బకాయిలు రాబట్టుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించింది.
పాత విధానంలో బిల్లింగ్కు జూన్ దాకా గడువు
పది కిలోవాట్లు ఆ పైన విద్యుత్ వినియోగించేవారికి టీజీఈఆర్సీ ఉపశమనం కల్పించింది. లీడింగ్ రియాక్టివ్ పవర్ ఆధారంగా కిలోవోల్ట్ ఆంపియర్ అవర్ (కేవీఏహెచ్) విధానంలో బిల్లింగ్ను జూన్ 30 దాకా నిలిపివేసింది. అప్పటి వరకు పాత విధానంలోనే బిల్లింగ్ చేయాలని ఆదేశించింది. కేవీఏహెచ్ విధానంపై అవగాహన కల్పించడంలో డిస్కమ్ల విఫలమవడంతో భారీగా బిల్లులు వచ్చి వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. 10 కిలోవాట్లు దాటిన వినియోగదారులు అందరికీ నోటీసులు, తగిన పరికరాలు బిగించుకోవడానికి వెసులుబాటు ఇవ్వాల్సి ఉన్నా డిస్కమ్లు ప్రభావవంతంగా ఆ నిర్ణయం అమలు చేయలేదని ఈఆర్సీ గుర్తించింది. ఇబ్బందులు పడిన హెచ్టీ వినియోగదారులకు వచ్చిన అదనపు బిల్లులను బిల్లులను రానున్న ఆరు బిల్లింగ్ మాసాల్లో సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది. సోలార్ రూఫ్టాప్ పెట్టుకున్న వినియోగదారులకు లోయర్ టారి్ఫలోనే బిల్లింగ్ చేయాలని ఆదేశించింది. పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్ల రవాణా ఖర్చును డిస్కమ్లే భరించాలని, నెల రోజుల వినియోగానికి రీడింగ్ తీయాలని పేర్కొంది.
రైతు డిస్కమ్ ఏర్పడ్డాకే..
రైతు డిస్కమ్ ఏర్పడిన తర్వాతే 2022-23 విద్యుత్ కొనుగోళ్ల ట్రూ-అప్, 2023-24 రెవెన్యూ ట్రూ-అ్పపై ఉత్తర్వులు ఇస్తామని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఈ రెండేళ్ల కాలానికి రూ.7635.22 కోట్ల ట్రూ-అ్పకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది.