సదర్ ఉత్సవాలను విస్తరించాలి
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:52 AM
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలను రాష్ట్రంలోని 612 మండల కేంద్రాలకు విస్తరించాలని, ప్రతి మండలానికి ఉత్సవాల నిర్వహణ కోసం రూ.1 లక్ష చొప్పున ప్రభుత్వ నిధులు..
మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతి
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలను రాష్ట్రంలోని 612 మండల కేంద్రాలకు విస్తరించాలని, ప్రతి మండలానికి ఉత్సవాల నిర్వహణ కోసం రూ.1 లక్ష చొప్పున ప్రభుత్వ నిధులు కేటాయించాలని తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ సింగం చరణ్ కౌశిక్ యాదవ్ కోరారు. యాదవ సమాజ ఆత్మగౌరవం, సాంస్కృతిక వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతిపత్రాన్ని సమర్పించారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో ‘యాదవ కమ్యూనిటీ క్లబ్’ నిర్మాణం కోసం 2 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి యాదవ్ జయంతి, వర్థంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. సైదాబాద్ ఫ్లైఓవర్కు ఆమె పేరు పెట్టాలని, ఐఎస్ సదన్ జంక్షన్ వద్ద ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.