ఆర్టీసీ బస్సులపై పోచంపల్లి ఇక్కత్.. వరంగల్ తివాచీలు
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:37 AM
ప్రయాణికుల కళ్లకు కట్టే విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన హస్తకళలపై ప్రచారానికి టీజీఎ్సఆర్టీసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది.
6 జీఐ ట్యాగ్ పొందిన హస్తకళలపై విస్తృత ప్రచారం
జేఎన్టీయూ ఫైన్ఆర్ట్స్ విద్యార్ధులతో స్టిక్కర్ల ప్రత్యేక డిజైన్
నేడు ఎంజీబీఎ్సలో ‘స్టిక్కర్ బస్సు’లను ప్రారంభించనున్న గవర్నర్
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల కళ్లకు కట్టే విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన హస్తకళలపై ప్రచారానికి టీజీఎ్సఆర్టీసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచన మేరకు రాష్ట్ర హస్త కళాకారుల వారసత్వ సాంస్కృతిక నైపుణ్యాన్ని ప్రజలకు తెలిపేందుకు.. ‘జీఐ’ ట్యాగ్ కల ఆరు హస్తకళలను బస్సులపై ముద్రించారు. ఎంజీబీఎ్సలో శుక్రవారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ‘జీఐ’ ట్యాగ్ స్టిక్కర్ వేసిన బస్సులను ప్రారంభిస్తారు. పోచంపల్లి ఇక్కత్, వరంగల్ తివాచీ, కరీంనగర్ సిల్వర్ ఫిలిట్రీ నారాయణ పేట చీరలు, చెరియాల్ స్ర్కోల్ పెయింటింగ్, నిర్మల్ పెయింటింగ్లను ఆయా జిల్లాలకెళ్లే బస్సులపై ముద్రించారు. తొలి దశలో జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులతో డిజైన్ చేసిన ప్రత్యేక స్టిక్కర్లను ఒక్కో జిల్లాకు చెందిన ఆరు ఎక్స్ప్రెస్ బస్సులపై ముద్రిస్తారు. ఆరు జిల్లాలకు తిరిగే బస్సులపై ఆయా ప్రాంత ప్రత్యేకతను చాటే జీఐ ట్యాగ్ పొందిన గుర్తింపులను ముద్రించి తిప్పుతారు. చారిత్రక నేపథ్యం కల స్థానిక సంస్కృతి, సంప్రదాయం నేటి తరం వారికి తెలిపేందుకు... చేతి వృత్తులకు విస్తృ ప్రచారం, కళాకారులకు చేయూతనందించేందుకు ఈ నూతన కార్యక్రమం చేపట్టారు.