క్వింటాల్ ధాన్యానికి 19 కిలోల తరుగు!
ABN , Publish Date - May 29 , 2026 | 03:35 AM
ధాన్యం బాగోలేదని, గింజ నాణ్యత లేదని సాకులు చెప్పి ఏకంగా క్వింటాలుకు 19 కిలోల తరుగు తీస్తానని ఓ రైస్ మిల్లర్ చెప్పడంతో కంగుతిన్న రైతు..
మిల్లర్ మాటలకు కంగుతిన్న రైతు
సోషల్ మీడియాలో వీడియో వైరల్
భూత్పూర్, మే 28 (ఆంధ్రజ్యోతి): ధాన్యం బాగోలేదని, గింజ నాణ్యత లేదని సాకులు చెప్పి ఏకంగా క్వింటాలుకు 19 కిలోల తరుగు తీస్తానని ఓ రైస్ మిల్లర్ చెప్పడంతో కంగుతిన్న రైతు.. ఆ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్మీడియాలో పోస్టు చేయగా వైరల్గా మారింది. తాటిపర్తికి చెందిన రైతు కుమ్మరి తిరుపతయ్య తన 9 ఎకరాల్లో వరి సాగు చేశాడు. దిగుబడిగా వచ్చిన 480 బస్తాల ధాన్యాన్ని ఆరబెట్టుకొని ఈ నెల 25న ఐకేపీ సెంటర్కు తరలించాడు. అక్క డ కొనుగోలుదారులు మండలంలోని పోతులమడుగు శివారులోని భాను రైస్ మిల్లుకు పంపించారు. 4 రోజులుగా క్యూలైన్లో ఉన్న ధాన్యపు ట్రాక్టర్లు గురువారం రైస్మిల్లుకు చేరాయి. అయి తే ధాన్యాన్ని పరిశీలించిన రైస్ మిల్లు యజమాని ఈ ధాన్యంలో తాలు ఎక్కువగా ఉన్నదని, క్వింటాల్కు 19 కిలోల తరుగు తీస్తానని రైతుకు చెప్పాడు. ఇలా అయితే తనకు చాలా నష్టం వస్తుందని ఆయన మిల్లు యజమానిని వేడుకున్నాడు. దీన్ని ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది. వెంటనే స్పందించిన జిల్లా పౌర సరఫరాల సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మమత వచ్చి మిల్లర్తో మాట్లాడారు. నిబంధనల ప్రకారమే తరుగు తీయాలని.. క్వింటాల్కు 5 కిలోల కంటే ఎక్కువ తీయొద్దని ఆదేశించారు. దీంతో ఆ మేరకు ధాన్యాన్ని మిల్లర్ కొనుగోలు చేశారు.