భూముల కొత్త విలువలు రేపట్నుంచే అమల్లోకి
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:22 AM
రాష్ట్రంలో పెంచిన భూముల మార్కెట్ విలువలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూ ముల విలువలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో హేతుబద్ధీకరించాలని....
పెంచిన విలువల ప్రకారమే స్టాంప్డ్యూటీ వసూలు: మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెంచిన భూముల మార్కెట్ విలువలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూ ముల విలువలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో హేతుబద్ధీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణ యం మేరకు సవరించిన విలువలను ఈ నెల 5 నుంచి అమలు చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం.. విస్తృత అధ్యయనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్లు, బహిరంగ మార్కెట్ ధరలు, ప్ర భుత్వ విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిశీలించి.. శాస్త్రీయంగా కొత్త విలువలను నిర్ణయించినట్లు మంత్రి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కసరత్తు లేకుండా, అశాస్త్రీయంగా 2021-22లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండు సార్లు భూముల విలువలను పెంచడంతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలను 6 నుంచి 7.5శాతానికి పెంచారని పేర్కొన్నారు. కేవలం శాతాల ఆధారంగా భూముల విలువలను నిర్ధారించారని, పట్టికలప్రకారం చేయడంవల్ల కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువల కంటే చాలాతక్కువగా, మరికొన్ని ప్రాంతా ల్లో అధిక విలువలు నిర్ణయించారని తెలిపారు.
భారీ వ్యత్యాసాలతో అనేక సమస్యలు
వాస్తవ మార్కెట్ విలువలకు, ప్రభుత్వ విలువలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉండడం వల్ల భూ లావాదేవీల్లో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువల పునఃసమీక్ష చేశామని వివరించారు. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి ఉన్న అవకాశాలు, వృద్ధి రేటు, ఇటీవల జరిగిన భూముల లావాదేవీలు, వేలంపాటలు, డిమాండ్, కొత్త రహదారులు, కారిడార్లు, ఓఆర్ఆర్, రీజినల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక ప్రగతి, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని విలువలను నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాం టి పెంపు ప్రతిపాదించలేదని చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్(క్యూర్), హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ, రాష్ట్రంలోని ఇతర ప్రాం తాల్లో వ్యవసాయ భూములు, ఫ్లాట్లు, ప్లాట్లకు కనీస ప్రాథమిక ధరలనూ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.