Share News

మార్జిన్‌ పెంచేవరకు సమ్మె

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:41 AM

రాష్ట్రంలో రిటైల్‌ చికెన్‌ షాపుల యజమానులకు పౌల్ర్టీ సంస్థలు మార్జిన్‌ను పెంచి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర రిటైల్‌ చికెన్‌ షాప్స్‌ అసోసియేషన్‌ నేతలు ...

మార్జిన్‌ పెంచేవరకు సమ్మె

  • రిటైల్‌ చికెన్‌ షాపుల యజమానుల ప్రకటన.. కిలో చికెన్‌కు మార్జిన్‌ రూ.40 ఇవ్వాలని డిమాండ్‌

  • ఇందిరాపార్కు వద్ద తెలంగాణ రిటైల్‌ చికెన్‌ షాప్స్‌ అసోసియేషన్‌ ధర్నా.. సమ్మె ప్రభావం పాక్షికం

కవాడిగూడ/అల్వాల్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రిటైల్‌ చికెన్‌ షాపుల యజమానులకు పౌల్ర్టీ సంస్థలు మార్జిన్‌ను పెంచి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర రిటైల్‌ చికెన్‌ షాప్స్‌ అసోసియేషన్‌ నేతలు జి. రాజు, వరుణ్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. పౌల్ర్టీ కంపెనీలు మార్జిన్‌ పెంచేవరకు చికెన్‌షాపుల నిరవధిక బంద్‌ను కొనసాగిస్తామని హెచ్చరించారు. బుధవారం ఇందిరాపార్కు వద్ద అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చికెన్‌ షాపుల యజమానులు ధర్నా నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన చికెన్‌ షాపుల యజమానులు ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని పౌల్ర్టీ కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ నేతలు జి.రాజు, వరుణ్‌యాదవ్‌ మాట్లాడుతూ.. మార్జిన్‌ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. పౌల్ర్టీ సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. చికెన్‌ వ్యాపారులకు ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ బీసీ పొలిటికల్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ అయిలి వెంకన్నగౌడ్‌లు మద్దతు ప్రకటించారు. ఇందిరా పార్కు ధర్నాలో వారు మాట్లాడుతూ.. పౌల్ర్టీ సంస్థలు లాభాల పెంచుకొనేందుకు రిటైల్‌ వ్యాపారులకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. మార్జిన్‌ను26 శాతం నుంచి 10 శాతానికి తగ్గించటం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ నేతలు లింగస్వామి, మహ్మద్‌ ఆయూబ్‌, రవిగౌడ్‌, సతీష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. మార్జిన్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలో పలుచోట్ల చికెన్‌ షాపుల యజమానులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని అల్వాల్‌లో 140 చికెన్‌ షాపుల యజమానులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కేజీ చికెన్‌కు మార్జిన్‌ను రూ.40 ఇచ్చేవరకు సమ్మె కొనసాగిస్తామని అల్వాల్‌ చికెన్‌ షాప్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌. శ్రీనివా్‌సరెడ్డి ప్రకటించారు. కాగా, హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, హోటళ్లపై చికెన్‌ షాపుల బంద్‌ ప్రభావం పెద్దగా కనిపించలేదు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె పాక్షికంగానే కొనసాగింది. వేల సంఖ్యలో రిటైల్‌ చికెన్‌ సెంటర్లు ఉన్నా, వాటి నిర్వాహకులంతా బంద్‌లో పాల్గొనలేదని సమాచారం.

Updated Date - Apr 02 , 2026 | 03:41 AM