వైద్యకళాశాలలకు అధ్యాపకుల కళ!
ABN , Publish Date - May 20 , 2026 | 03:43 AM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది....
433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పునఅభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఆహ్వానించింది. హైదరాబాద్లోని వెంగళ్రావు నగర్లో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈ నెల 22, 23 తేదీల్లో వెరిఫికేషన్ జరగనుందని, అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని బోర్డు పేర్కొంది. ఈ తేదీల్లో రాలేకపోయిన వారు, 25న వచ్చి సర్టిఫికెట్లు అందజేయవచ్చని స్పష్టం చేసింది. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయగా.. పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, అనెస్తీషియా విభాగాల్లోని 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. మిగిలిన 30 డిపార్ట్మెంట్లలోని 433 పోస్టులకు సంబంధించి.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన అనంతరం తుది జాబితా విడుదల చేస్తామని బోర్డు తెలిపింది.
మెడికల్ షాపుల బంద్.. ప్రజలకు ఇబ్బంది కలగవద్దు: వైద్యమంత్రి దామోదర
బుధవారం మెడికల్ షాపుల బంద్కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24 గంటలపాటు ఫార్మసీలు తెరిచి ఉంచాలని, ఫార్మసిస్టులందరూ అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.