హరీశ్రావు కాదు.. బ్లాక్మెయిల్ రావు
ABN , Publish Date - May 03 , 2026 | 04:20 AM
హరీశ్రావు హ్యామ్ రోడ్ల కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి బెదిరిస్తూ.. బ్లాక్మెయిల్ రావుగా మారారని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ దుయ్యబట్టారు. బావాబామ్మర్దులు పోటీ పడి మరీ కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్..
హ్యామ్ రోడ్ల కాంట్రాక్టర్లకు ఫోన్చేసి డబ్బుల కోసం బెదిరిస్తున్నారు: బల్మూరి
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): హరీశ్రావు హ్యామ్ రోడ్ల కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి బెదిరిస్తూ.. బ్లాక్మెయిల్ రావుగా మారారని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ దుయ్యబట్టారు. బావాబామ్మర్దులు పోటీ పడి మరీ కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, బెదిరించి ఎలా డబ్బులు వసూలు చేయాలన్నదే వారి ఆలోచన అని మండిపడ్డారు. నిబంధనల ప్రకారమే టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. శనివారం సీఎల్పీ మీడియా సెంటర్లో బల్మూరి మాట్లాడారు. ‘పదేళ్లు బ్లాక్ మెయిల్ చేసి అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లకు ముందుకురాలేదు. మీ కుటుంబంలోని మహిళనే ప్రతిరోజు ఏడిపిస్తున్నారు. కవిత ఆరోపణలకు సమాధానం ఇవ్వని హరీశ్రావు మా ప్రభుత్వాన్ని విమర్శిస్తారా?’ అని ప్రశ్నించారు. అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు తాట తీస్తారని హెచ్చరించారు.