టెక్నాలజీతో పోలీసింగ్ బలోపేతం
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:31 AM
సాంకేతిక పరిజ్ఞానంతో డేటా ఆధారిత పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని డీజీపీ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు.
ప్రతి విభాగంలో మహిళలకు 33శాతం పోస్టులు
ఇంటి పని వాళ్ల వివరాలు డేటాబేస్లో ఉండాలి
స్టాఫ్ ఆఫీసర్లు, ఎస్హెచ్వోలతో సమీక్షలో డీజీపీ
హైదరాబాద్, జూన్ 8 ( ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానంతో డేటా ఆధారిత పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని డీజీపీ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. సాంకేతికతను వినియోగించుకోవడంలో తెలంగాణ పోలీస్ శాఖ ముందంజలో ఉందని తెలిపారు. అన్ని యూనిట్ల అధికారులతోపాటు స్టాఫ్ ఆఫీసర్లు, స్టేషన్హౌస్ ఆఫీసర్లతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ వ్యవస్థలను రూపొందించడంత పాటు సమర్థవంతంగా అమలు చేయడం అత్యంత ముఖ్యమని చెప్పారు. పోలీస్ శాఖలో టెక్నికల్ అంశాల పర్యవేక్షణ, అమలు కోసం ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలీసు వ్యవస్థల్లో నమోదయ్యే సమాచారం రియల్ టైమ్లో అప్డేట్ అవుతూ ఉండాలని సూచించారు. డిజిటల్ ఫోరెన్సిక్, డిజిటల్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్, సాంకేతికత ఆధారిత దర్యాప్తు విధానాలను విస్తృతంగా వినియోగిస్తే నేర పరిశోధనల్లో నాణ్యత పెరుగుతుందన్నారు. ఏఐ ఆధారిత పోలీసింగ్, డ్రోన్స్, డేటా ఇంటెలిజెన్స్, స్మార్ట్ అప్లికేషన్ల వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. కేసులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎస్హెచ్వోలు సిస్టమ్లో నమోదు చేయాలని సూచించారు. ‘‘తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్-యూజింగ్ టెక్నాలజీ’’ అనే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ను సమర్థవంతంగా వినియోగిస్తే క్రైమ్ అనాలసిస్, కేసుల పర్యవేక్షణ సులభమవుతుందని పేర్కొన్నారు. ఇటీవల నేపాల్తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు గృహ సేవకులుగా పని చేస్తూ నేరాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని డొమెస్టిక్ సర్వెంట్స్ వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని ఆదేశించారు. నవంబరులో పోలీస్ ట్రిట్తోపాటు అక్టోబరులో మహిళా పోలీస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా పోలీసులకు 33 శాతం రిజర్వేషన్ సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు లా అండ్ ఆర్డర్, ఫీల్డ్ డ్యూటీల్లో మరింతగా అవకాశాలు కల్పించాలని సూచించారు.